Breaking News

నవ దంపతుల దుర్మరణం

ఏలూరు టౌన్‌: రోడ్డు ప్రమాదం నవదంపతులను బలిగొన్నది. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా పూళ్ల గ్రామం సమీపంలో జాతీయ రహదారిపై చోటుచేసుకున్నది. ప్రమాదంలో డ్రైవర్‌ కూడా మృతిచెందగా, వధువు సోదరుడు తీవ్రగాయాలతో బయటపడ్డాడు. విశాఖ జిల్లా సబ్బవరానికి చెందిన యడ్లపల్లి వెంకటేష్‌కు గుంటూరు జిల్లా తెనాలి సమీపంలోని గోవాడకు చెందిన ఆలపాటి మానస నవ్యతో ఈ నెల 14న రాత్రి గోవాడలో వివాహం జరిగింది. వివాహం అనంతరం గురువారం వధువు సోదరుడు భరత్‌తో కలిసి నవ దంపతులు సబ్బవరానికి కారులో బయలుదేరారు. పూళ్ల గ్రామం సమీపానికి వచ్చేసరికి హైవేపై కారు డివైడర్‌ను ఢీకొట్టి గాలిలో ఎగురుతూ ఆవలి వైపు పడింది. అదే సమయంలో ఏలూరు వైపు వస్తున్న లారీ వీరి కారును బలంగా ఢీకొట్టడంతో కారు నుజ్జునుజ్జయ్యింది. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.