Breaking News

తెలంగాణ గొప్పగా బతకాలె

తెలంగాణ గొప్పగా బతకాలె
  • దేశానికి ఆదర్శం కావాలె
  • రైతులకు త్వరలోనే తీపికబురు
  • బంగారు తెలంగాణే నా ఆశయం
  • ఇది నియంతృత్వ సాగు కాదు
  • కొండపోచమ్మ సాగర్‌ ప్రారంభోత్సవంలో సీఎం కేసీఆర్​

సారథి న్యూస్​, మెదక్​: ‘దేశానికి మనం ఆదర్శం కావాలి.. అద్భుతాలు సృష్టించే రైతాంగం కావాలి. అన్ని కులాలు, అన్ని మతాలు.. అద్భుతంగా బతకాలి. అదే నా ఆశయం, కల. దేశానికి మార్గదర్శకం అయ్యాం..’ అని సీఎం కె.చంద్రశేఖర్​రావు అన్నారు. తెలంగాణ రైతులకు త్వరలోనే తీపికబురు చెబుతానని ప్రకటించారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో అత్యంత కీలమైన, సిద్దిపేట జిల్లా మర్కూక్​ మండలంలో నిర్మించిన కొండపోచమ్మ సాగర్‌ పంపుహౌస్‌‌ను సీఎం కె.చంద్రశేఖర్​రావు శుక్రవారం ప్రారంభించారు. చినజీయర్‌ స్వామితో కలిసి ఆయన మోటార్‌ ను ఆన్‌ చేశారు. దీంతో రిజర్వాయర్‌లోకి గోదావరి జలాలు పరవళ్లు తొక్కాయి. అనంతరం మీడియా ప్రతినిధుల సమావేశంలో సీఎం కేసీఆర్​ మాట్లాడారు.
‘కొండపోచమ్మ సాగర్​ ప్రాజెక్టు ప్రారంభం సందర్భంగా రైతాంగానికి శుభాకాంక్షలు. రైతుబీమా, రైతుబంధు.. అద్భుతమైన పథకాలు. రైతులకు నాణ్యమైన కరెంట్​ ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణ.. రైతుల నుంచి ఒక్కరూపాయి నీటి తీరువా తీసుకోం. రైతు రుణమాఫీ తూచ తప్పకుండా చేశాం. రూ.10వేల కోట్ల రైతుల కరెంట్ బిల్లులు చెల్లిస్తున్నాం. రైతులకు త్వరలోనే తీపి కబురు.. గొప్ప శుభవార్త చెప్పబోతున్న. భారతదేశం అంతా అశ్చర్యపడే వార్త చెబుత.. నియంత్రిత సాగు మాత్రమే.. నియంతృత్వ సాగు కాదు. చాలా జిల్లాల్లో రైతులంతా ఏకమై ఏకగ్రీవ తీర్మానాలు చేసుకుంటున్నారు.

ఇది ఉజ్వలమైన ఘట్టం వద్ద నయాగారా సీన్​ కనిపిస్తది. ఇది ప్రాజెక్టు ప్రారంభం ఉజ్వలమైన ఘట్టం.. అది అపురూపమైన ప్రాజెక్టు.. వందలాది పంపుసెట్లు.. కాళేశ్వరం ప్రాజెక్టులో 10వ లిఫ్టు కాళేశ్వరం.. ప్రకారం బ్యారేజీ నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు వరకు భూములు కోల్పోయిన వారికి శిరస్సు వచ్చి ధన్యవాదాలు తెలియజేస్తున్నా.. రంగనాయకసాగర్​, మల్లన్న సాగర్​, మిడ్​ మానేర్​ ప్రాజెక్టులో భూములు ఇచ్చిన వారికి పరిహారం కూడా ఇచ్చాం. కానీ గూడు చెదిరిన పక్షుల్లా మారారని నాకూ ఆవేదన ఉంది. వారిని మెప్పించే స్థాయిలో పరిహారం ఇచ్చాం. నిర్వాసితులకు ఆర్​అండ్​ఆర్ కాలనీలతో గజ్వేల్​ రూపుదిద్దుకుంటోంది. పట్టణానికి ప్రతిసృష్టి జరుగుతోంది. నాన్​ పొల్యూటెడ్​ ఫుడ్​ ప్రాసెసింగ్​ ఇండస్ట్రీ సెజ్​ను ఏర్పాటు చేయబోతున్నాం. వారందరికీ ఉపాధి కల్పిస్తాం.
వారి శ్రమ మరవలేనిది
మల్లన్నసాగర్ ఎస్​ఆర్​ఎస్​పీ తర్వాత అతిపెద్ద రిజర్వాయర్​ కొండపోచమ్మ సాగర్​ కాళేశ్వరంలో పదో లిఫ్టు. 4800 మెగావాట్ల విద్యుత్​ వాడుతున్నాం. రెవెన్యూ శాఖ, ఇంజనీరింగ్​ అధికారులకు ధన్యావాదాలు. తెలంగాణ ఇంజనీర్ల అమోఘమైన ప్రతిభకు నిదర్శనం కాళేశ్వరం ప్రాజెక్టు. నాగార్జునసాగర్​ కంటే ఇది పెద్దకాల్వ.. రైతుల సాగునీటి కష్టాలు పూర్తిగా దూరం చేసి, వ్యవసాయ భూములను సస్యశ్యామలం చేసి ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు ఈ ప్రాజెక్ట్ చేపట్టాం. రాజస్తాన్​, చత్తీస్​గఢ్​, జార్ఖండ్​ నుంచి కూలీల శ్రమటోడ్చి ప్రాజెక్టు కోసం పనిచేశారు. అందరికి మించి వలస కార్మికులను వారి గమ్యస్థానాలకు చేర్చేందుకు రూ.12 కోట్లు ఖర్చుచేశాం.. వారంతా విశేషమైన కృషిచేసినారు.
తెలంగాణ గొప్ప బయోడైవర్సిటీ
ఆరేళ్ల క్రితం అనాథలా ఉన్న తెలంగాణ ఇప్పుడూ పసిడి పంటల తెలంగాణ మారింది. ఒక్కప్పుడు భయంకరమైన కరెంట్​ గండాలను చూసినం. ఖాళీబిందెల ప్రదర్శన ఎక్కడా లేదు. మిషన్​ భగీరథ ద్వారా తాగునీటి కష్టాలు తీర్చినం. జహీరాబాద్​ కు సింగూరు నుంచి లిఫ్ట్​పెట్టి నీళ్లిస్తాం.. ఎండిపోని మంజీరాను మనం చూడబోతున్నాం.. నిజాంసాగర్​ మనకు అన్నం పెడతది.. హల్దీపై ఐదు లిఫ్టు​లు నిర్మిస్తున్నాం.. అద్భుతంగా భూగర్భజలాలు పెరిగాయి. రూ.4వేల కోట్లతో రాష్ట్రవ్యాప్తంగా 1250 నూతన చెక్​డ్యామ్​లు నిర్మిస్తున్నాం. తెలంగాణ గొప్ప బయోడైవర్సిటీ. దుమ్ముగూడెంలో సీతమ్మ సాగర్​ నిర్మాణం పూర్తవుతోంది. కొండపోచమ్మ సాగర్ నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతుల త్యాగాలు వెలకట్టలేనివి..’ అని సీఎం కేసీఆర్​​ కొనియాడారు. కార్యక్రమంలో మంత్రులు హరీశ్​రావు, ఇంద్రకరణ్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, ఎంపీలు సంతోష్‌కుమార్‌, కొత్త ప్రభాకర్‌రెడ్డి, సిద్దిపేట కలెక్టర్​ వెంకట్రామరెడ్డి తదితరులు పాల్గొన్నారు.