Breaking News

తమిళనాడులో బీజేపీ కొత్తఎత్తులు

తమిళనాడులో బీజేపీ కొత్త ఎత్తులు

చెన్నై: త్వరలో జరగబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని బీజేపీ కొత్త ఎత్తులు వేస్తోంది. అందులో భాగంగానే గంధపు చెక్కల స్మగ్లర్​ వీరప్పన్​ కూతురు విద్యావీరప్పన్​కు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించింది. తమిళనాడు యువమోర్చా విభాగం ఉపాధ్యక్షురాలిగా ఆదివారం ఆమెను నియమించింది. వృత్తిరీత్యా న్యాయవాది అయిన ఆమె గత ఫిబ్రవరిలో బీజేపీలో చేరారు. అప్పటినుంచి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తున్న తరుణంలో వీరప్పన్ వర్గాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవాలని బీజేపీ నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. దీనిలో భాగంగానే విద్యకు రాష్ట్రస్థాయిలో పదవిని కట్టబెట్టారు. మరోవైపు పాత వీరప్పన్‌ వర్గాన్ని మొత్తం బీజేపీ వైపునకు తిప్పేలా విద్యావీరప్పన్​ కీలకంగా వ్యవహరిస్తున్నారు. కాగా, గంధపు చెక్కల స్మగ్లర్‌గా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన వీరప్పన్‌ 2004లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన విషయం తెలిసిందే.