Breaking News

జిమ్‌లు, యోగా సెంటర్లు ఖుల్లా

జిమ్‌లు, యోగా సెంటర్లు ఖుల్లా

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం అన్‌లాక్ 3.0 మార్గదర్శకాలను సోమవారం విడుదల చేసింది. ఆగస్టు 5 నుంచి దేశవ్యాప్తంగా యోగా సెంటర్లు, జిమ్‌లు తెరుచుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే కోవిడ్‌ 19 కంటైన్‌మెంట్‌ జోన్లలో యోగా సెంటర్లు, జిమ్‌లను ఎట్టి పరిస్థితుల్లోనూ తెరవకూడదని సూచించారు. అలాగే 65 ఏళ్లు దాటినవారు, గర్భిణులు, 10ఏళ్ల లోపు పిల్లలు వెంటిలేషన్‌ లేని జిమ్‌లకు వెళ్లకపోవడమే మంచిదని హెచ్చరించింది. ప్రతి ఒక్కరూ ఆరు అడుగుల దూరం కచ్చితంగా పాటించాలని సూచించింది. పరిసరాల్లో ప్రతి ఒక్కరూ మాస్కులను వాడాలని, అలాగే యోగా, ఎక్సర్‌సైజ్‌ చేసేటప్పుడు తేలికపాటి వైజర్‌ వాడాలని, ఎన్ 95 మాస్కులను వాడితే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తవచ్చని స్పష్టంచేసింది. తరచూ చేతులు శుభ్రం చేసుకోవాలని, ఆల్కాహాల్‌తో కూడిన శానిటైజర్లను వాడడం మంచిదని అవగాహన కల్పించింది.
‘ఆరోగ్య సేతు’ను ఇన్​స్టాల్​ చేసుకోవాలి
ప్రతి ఒక్కరూ దగ్గే సమయంలో మూతి, ముక్కును కవర్ చేసుకోవాలని, వాడిన టిష్యూలను పద్ధతిగా పడేయాలని కేంద్రప్రభుత్వం సూచించింది. ఏదైనా అనారోగ్య సమస్య ఉన్నప్పుడు వెంటనే రాష్ట్ర లేదా జిల్లా హెల్ప్‌లైన్‌ను సంప్రదించడం మంచిదని సలహా ఇచ్చింది. పరిసర ప్రదేశాల్లో ఉమ్మివేయడం నిషేధమని, ఆరోగ్య సేతు యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకుని వాడడం మంచిదని సూచించింది.