Breaking News

జాన్వీ సినిమా కూడా ఓటీటీలో


లెజెండరీ హీరోయిన్ శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ ‘ధడక్’ సినిమాతో బాలీవుడ్​ లో ఎంట్రీ ఇచ్చింది. సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోయినా జాన్వీ నటనకు మాత్రం మంచి పేరే వచ్చింది. ఫస్ట్ సినిమాతో ఊహించని ఫలితాన్ని అందుకున్న జాన్వీ కపూర్ ఆ తరువాత ‘ఘోస్ట్ స్టోరీస్’ అనే ఒక వెబ్ సిరీస్ లో నటించింది. నెక్ట్స్ ‘గుంజన్ సక్సేనా: ద కార్గిల్ గర్ల్’ సినిమాలో టైటిల్ రోల్ ప్లే చేసింది. కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న మొట్ట మొదటి పైలెట్ గుంజన్ సక్సేనా జీవిత కథ ఆధారంగా వస్తున్న ఈ బయోపిక్ గతేడాది డిసెంబర్ లోనే పూర్తయింది. అయితే ప్రస్తుతం ఇండస్ట్రీలో నెలకొన్న పరిస్థితుల వలన రిలీజ్ కాలేదు.

అయితే గత కొన్ని రోజులుగా ఈ సినిమాని ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రానికి శరణ్ శర్మ దర్శకత్వం వహించగా నిర్మాత కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్స్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. తాజాగా ఈ సినిమాను అధికారికంగా ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో విడుదల చేయనున్నారు. థియేటర్స్ లో విడుదల కాకుండా నేరుగా ఓటీటీలో విడుదల కాబోతున్న మరో క్రేజీ ప్రాజెక్ట్ ‘గుంజన్ సక్సెనా’ అని చెప్పొచ్చు. ఇప్పటికే అమితాబ్ – ఆయుష్మాన్ ఖురానా నటించిన ‘గులాభో సితాబో’ సినిమా ఓటీటీలో రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు గుంజన్ సక్సేనా రిలీజ్ పై ఒక వీడియో ద్వారా కరణ్ జోహార్ క్లారిటీ ఇచ్చారు. ఆ వీడియోకు జాన్వీ కపూర్ వాయిస్ ఓవర్ కూడా ఇచ్చింది. అయితే సినిమా రిలీజ్ డేట్ పై చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన ఇంకా చేయలేదు. ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకొని క్రేజీ హీరోయిన్ గా మారిపోవాలనుకున్న జాన్వీ కపూర్ కి ‘గుంజన్ సక్సేనా’ ఓటీటీ రిలీజ్ ఎలాంటి రిజల్ట్ ఇవ్వనుందో చూడాల్సిందే.