Breaking News

గ్రామాల్లోనే ధాన్యం సేకరణ

గ్రామాల్లోనే ధాన్యం సేకరణ

  • రైతాంగం గాబరా పడాల్సిన అవసరం లేదు
  • తాలు పొల్లు లేకుండా ధాన్యాన్ని తీసుకురావాలి
  • కేబినెట్​ సమావేశంలో సీఎం కేసీఆర్​ కీలక నిర్ణయాలు

సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం ప్రగతి భవన్ లో ఆదివారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన జరిగింది. మంత్రిమండలి పలు నిర్ణయాలు తీసుకుంది. వ్యవసాయ రంగంపై కేబినెట్ సమగ్రంగా చర్చించింది. రైతాంగం క్షేమం కోసం తీసుకోవాల్సిన చర్యలను సమగ్రంగా చర్చింది.
– కరోనా సమయంలో రైతు కుటుంబాలకు ఇబ్బంది కలగకుండా గ్రామాల్లోనే ధాన్యం సేకరణ చేసినట్టు ఈసారి కూడా అదే పద్ధతిలో ధాన్యం సేకరించాలని నిర్ణయించింది. కరోనా ఇంకా పూర్తిగా సమసిపోనందున రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని గ్రామాల్లోనే ధాన్యం సేకరణ చేపట్టాలని నిర్ణయించింది. ఆరువేల ధాన్యం సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేయాలని, ఎన్నిరోజులైనా ధాన్యం కొనుగోలు చేస్తామని, చివరి గింజవరకూ కొనుగోలు చేయాలని నిర్ణయించింది. రైతాంగం గాబరా పడాల్సిన అవసరం లేదని, ధాన్యాన్ని తమ తమ గ్రామాల్లో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాల్లో విక్రయించుకోవాలని కోరింది. కాగా, ధాన్యంలో తేమను 17 శాతానికి మించకుండా చూసుకుని, తాలు పొల్లు లేకుండా ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తేవాలని రైతాంగాన్ని కేబినెట్ కోరింది.
–మొక్కజొన్న పంటకు కనీస మద్దతు ధర రాకపోవడంపై కేబినెట్ ఆందోళన వ్యక్తం చేసింది. దేశంలో వ్యవసాయ రంగానికి కేంద్ర నిర్ణయాలు గొడ్డలిపెట్టుగా మారడం శోచనీయమని అభిప్రాయం వ్యక్తంచేసింది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలతో వ్యవసాయ రంగానికి, ప్రత్యేకించి మొక్కజొన్న పంటకు కనీస మద్దతు ధర లభించని దుస్థితి ఏర్పడడంపై కేబినెట్ ఆవేదన వ్యక్తం చేసింది. దేశంలో అవసరానికి మించి మొక్కజొన్న నిల్వలు ఉన్నప్పటికీ దేశ రైతాంగ ప్రయోజనాలను విస్మరించి, ఇతర దేశాలనుంచి మక్కలు దిగుమతి చేసుకోవాలనుకునే కేంద్రం ఆలోచన పట్ల కేబినెట్ విస్మయం వ్యక్తంచేసింది. సంప్రదాయంగా మొక్కజొన్న పంటను సాగుచేసే తెలంగాణ రైతుకు కనీస మద్దతు ధర రాకుండాపోయే గడ్డుకాలం గురించి ఆందోళన వ్యక్తం చేసింది. విశ్వవిఫణిలో మొక్కజొన్నల నిల్వలు ప్రజావసరాలకు మించి ఉండడంతో పాటు కేంద్ర నిర్ణయాల నేపథ్యంలో మొక్కజొన్న సాగు విషయంలో రాష్ట్ర రైతాంగం ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని కోరింది.
– నాలా చట్టానికి సవరణ.. వ్యవసాయ భూమి నుంచి వ్యవసాయేతర భూమిగా మార్చే క్రమంలో సంబంధిత అధికారి విచక్షణాధికారం దుర్వినియోగానికి గురికాకుండా చూసేందుకు ఇటీవలి నూతన రెవెన్యూ చట్టంలో సవరణలు సూచించింది. ధరణి పోర్టల్ ద్వారా సంబంధిత వివరాలను అందజేస్తూ ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకునే వెసులుబాటును పౌరులకు కల్పిస్తూ, భూమార్పిడి సులభతరం చేస్తూ చట్ట సవరణకు మంత్రి మండలి నిర్ణయించింది.
–రిజిస్ట్రేషన్ చట్టానికి స్వల్ప సవరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
–జీహెచ్ఎంసీ చట్టం 1955 సవరణ.. జీహెచ్ఎంసీ పాలకమండలిలో మహిళలకు 50శాతం ప్రాతినిధ్యానికి చట్టబద్ధత కల్పిస్తూ వార్డు కమిటీల పని విధానానికి సంబంధించి వార్డుల రిజర్వేషన్ కు సంబంధించిన అంశంలో చట్టసవరణలు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
– రాష్ట్రంలో కొనసాగుతున్న ఆన్ లైన్​లో ఆస్తుల నమోదుకు మరో పదిరోజుల పాటు అనగా అక్టోబర్ 20వ తేదీ వరకు గడువును పొడిగిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకున్నది.
– హెచ్ఎండీఏ పరిధిలో ఇంటిగ్రేటెడ్ టౌన్ షిప్ విధానంపై కేబినెట్ చర్చించింది.