Breaking News

కృష్ణం వందే జగద్గురుం​

కృష్ణం వందే జగద్గురుం​

ద్వాపరయుగంలో శ్రీముఖ నామ సంవత్సరం శ్రావణ మాసంలో బహుళ అష్టమి రోజున అర్ధరాత్రి రోహిణి నక్షత్రంలో శ్రీకృష్ణుడు జన్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి. దేవకీ వసుదేవులకు అష్టమ (8వ) సంతానంగా శ్రీకృష్ణుడు జన్మించాడు. కృష్ణావతారాన్ని శ్రీమహావిష్టువు ఎనిమిదో అవతారంగా పురాణాల్లో చెప్పుకుంటారు. శ్రీమహావిష్ణువు అవతారాల్లో శ్రీకృష్ణావతారం విశిష్టమైంది. అందుకే కృష్ణపరమాత్మ ఆవిర్భవించిన దివ్యతిథినే ‘కృష్ణాష్టమి’గా జరుపుకుంటారు. కృష్ణాష్టమిని జన్మాష్టమి, గోకులాష్టమి, అష్టమి రోహిణి అని కూడా పిలుస్తారు. పండుగ రోజున ఉదయాన్నే స్నానాదులు పూర్తిచేసి షోడశోపచారాలతో కృష్ణుడికి అర్చనలు చేస్తారు. ఆయనకు ఎంతో ఇష్టమైన అటుకులు, వెన్న, పాలు, పెరుగు, మీగడ మొదలైనవన్నీ నైవేద్యంగా సమర్పిస్తారు.

కృష్ణాష్టమి రోజున బాలకృష్ణుడి చిన్న చిన్న పాదాలు లోగిళ్లలో వేసి కృష్ణుడు ఇంట్లోకి రావాలని భక్తులు కోరుకుంటారు. ఇంటి ముఖద్వారాలకు పచ్చని మామిడాకు తోరణాలు, వివిధ పూలతో తోరణాలు కడతారు. కృష్ణుడి విగ్రహాన్ని తడి వస్త్రంతో శుభ్రం చేసి.. చందనం, కుంకుమలతో తిలకం దిద్దుతారు. కృష్ణుడి విగ్రహాన్ని, పూజా మందిరాన్ని పూలతో అలంకరిస్తారు. అక్షింతలు, ధూపదీపాలతో స్వామి వారిని పూజిస్తారు. పూజాది క్రతువు పూర్తయిన తర్వాత శ్రీకృష్ణలీల ఘట్టాలని చదవాలని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. కృష్ణాష్టమి నాడు కేవలం భగవానుడిని పూజించడమే కాదు, ఆయనలోని కొన్ని మంచి లక్షణాలను అలవర్చుకోవాలి. ప్రతి విషయంలోనూ స్వార్థం, ఈర్ష్య, అసూయలను కొంతైన విడనాడి మానవజన్మకు సార్ధకతని ఏర్పరచుకోవాలి.

శ్రీకృష్ణుడు తన లీలల ద్వారా భక్తులకు జ్ఞానోపదేశం చేశాడు. ఆయన చేసిన అన్ని పనుల్లోనూ అర్థం పరమార్థం కనిపిస్తాయి. ధర్మపరిరక్షణలో రాగద్వేషాలకు అతీతంగా వ్యవహరించాడు. కాబట్టి కృష్ణాష్టమి రోజున కృష్ణుడిని అర్చిస్తే సకల పాపాలు తొలగిపోతాయి. ధర్మార్థ కామ మోక్ష ప్రాప్తి కలుగుతాయని స్కందపురాణం చెబుతోంది. ఈ రోజున బంగారంతో కాని, వెండితో కాని చంద్రబింబాన్ని తయారుచేసి వెండి, బంగారు పాత్రలలో దానిని ఉంచి పూజించి అర్ఘమిస్తే సకల కోరికలు తీరుతాయని భవిష్యోత్తర పురాణం ద్వారా తెలుస్తుంది. అంతే కాకుండా ఈ రోజు భీష్మాచార్యులను పూజిస్తే సకల పాపాలు తొలగుతాయని మహర్షుల వారు చెప్పారు. సంతానం లేని వారు బాలకృష్ణుడిని సంతాన గోపాల మంత్రంతో పూజిస్తే సంతానం కలుగుతుందని ప్రగాఢ విశ్వాసం.

పెళ్లికానివారు, వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారు రుక్మిణి కల్యాణం, పారాయణం చేయడం ద్వారా వారికి వివాహ యోగం కలుగుతుందట. అలాగే శ్రీకృష్ణుడిని స్మరిస్తూ గోవులను దానం చేస్తే ఆ భగవానుడి అనుగ్రహం, కృప కలుగుతాయని భక్తుల నమ్మకం. ఇక శ్రీకృష్ణుడు వెన్న కోసం ఉట్టిలోని కుండలను పగలగొట్టినట్టే.. కృష్ణాష్టమి నాడు భక్తులంతా ఒక చోటికి చేరి ఉట్టికొట్టడం సంప్రదాయంగా వస్తోంది. ఈ ఉట్టి కొట్టే వేడుకను భక్తులు ఎంతో సంబరంగా జరుపుకుంటారు.

:: దిండిగల్​ ఆనంద్​శర్మ,
సీనియర్​ జర్నలిస్ట్,​
సెల్​నం.96660 06418