Breaking News

కార్పొరేట్ సంస్థలకు కొమ్ముకాసేలా నల్లచట్టాలు

కార్పొరేట్ సంస్థలకు కొమ్ముకాసేలా నల్లచట్టాలు

సారథి న్యూస్, మానవపాడు: నీరవ్ మోడీ, లలిత్ మోడీ, విజయ్ మాల్యా లాంటి వ్యక్తులకు దోచిపెట్టేందుకు నల్ల చట్టాలను తీసుకొస్తున్నారని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. భారత్​బంద్​కార్యక్రమంలో భాగంగా మంగళవారం జోగులాంబ గద్వాల జిల్లా అల్లంపూర్ చౌరస్తా సమీపంలోని పుల్లూరు టోల్ ప్లాజా వద్ద బెంగళూరు– హైదరాబాద్ హైవేను అఖిలపక్ష నాయకులతో కలిసి దిగ్బంధించారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్​రెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ వర్గాలకు సంబంధించిన మొండిబకాయిలను రద్దుచేసిందన్నారు. నూతన వ్యవసాయ చట్టంలో కనీస మద్దతు ధర అనే అంశాన్ని ప్రస్తావించకుండా కార్పొరేట్ సంస్థలకు కొమ్ముకాసే విధంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. స్వామినాథన్ కమిషన్ కింద రైతులకు మద్దతు ధర ఉండాలని చెప్పకపోగా, కనీస చట్టంలో ఈ ప్రస్తావన లేకపోవడం చాలా బాధాకరమన్నారు. కేంద్రప్రభుత్వం మతాల మధ్య చిచ్చుపెడుతూ దుర్మార్గమైన సృష్టిస్తుందని మండిపడ్డారు. అనంతరం మంత్రి నిరంజన్ రెడ్డి ధర్నాకు వచ్చిన రైతులతో కలిసి హైవేపై సహపంక్తి భోజనం చేశారు. ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతమైన పుల్లూరు టోల్ ప్లాజా వద్ద జాతీయ రహదారిని దిగ్బంధించడంతో మూడు గంటల పాటు భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.