Breaking News

కర్నూలును కరోనా క్యాపిటల్‌గా మార్చారు

కర్నూలును కరోనా క్యాపిటల్‌గా మార్చారు

సారథి న్యూస్, కర్నూలు: రాయసీమ ముఖద్వారమైన కర్నూలులో న్యాయరాజధాని ఏర్పాటు చేస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం కరోనా క్యాపిటల్‌గా మార్చిందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్​ఎద్దేవా చేశారు. గ్రామాల్లో సచివాలయాలతో వికేంద్రీకరణ చేసినట్లు ప్రాంతీయ కోవిడ్‌ ఆస్పత్రులుగా ఏర్పాటుచేస్తే బాగుంటుందన్నారు. ఆదివారం నగరంలోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర కోవిడ్‌ ఆస్పత్రిగా కర్నూలు సర్వజన ఆస్పత్రిని మార్చారని, నగరం నడిబొడ్డున ఆస్పత్రి ఉన్నందున వైరస్‌ ప్రజకు ప్రబలే అవకాశం ఎక్కువగా ఉందన్నారు.

కోవిడ్‌ ప్రాంతీయ ఆస్పత్రిగా ఏర్పాటుచేస్తే కరోనా కట్టడి సాధ్యమవుతుందన్నారు. డిసెంబర్​లోగా కరోనా వ్యాక్సిన్‌ పూర్తిస్థాయిలో వచ్చే అవకాశం ఉందని, కానీ ప్రజలందరికీ వ్యాక్సిన్‌ అందుబాటులోకి రావడానికి, సెట్‌ కావడానికి వచ్చే ఏడాది డిసెంబర్‌ వరకు సమయం పట్టొచ్చన్నారు. అప్పటివరకు ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వీలైనంత త్వరగా ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి ఎంత ఖర్చు పెట్టడానికైనా ప్రధాన మంత్రి నరేంద్రమోడీ సిద్ధంగా ఉన్నారన్నారు. రాయసీమ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు బీజేపీ డిక్లరేషన్‌ ఇవ్వడం సంతోషకరమని రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్‌ అన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా రాయసీమలో మినీ సెక్రటేరియట్‌ ఏర్పాటు చేయడంతో పాటు శీతాకాల సమావేశాలు నిర్వహించాలన్నారు. అప్పుడే రాయలసీమకు పూర్తిన్యాయం చేసినట్టు అవుతుందన్నారు.