Breaking News

కరోనాపై అలర్ట్​గా ఉండండి

కరోనాపై అలర్ట్​గా ఉండండి

– లక్ష పడకలు సిద్ధం చేయండి

– అధికారులతో ఏపీ సీఎం వైఎస్ జగన్ సమీక్ష

సారథి న్యూస్, అనంతపురం: కరోనా కేసులు ఎక్కువగా నమోదైన క్లస్టర్లలో ప్రజల కదలికలను కట్టడి చేయాలని ఏపీ సీఎం వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆదేశించారు. కొవిడ్‌-19 నివారణ చర్యలు, లాక్‌ డౌన్‌ పొడిగింపు, కేంద్ర హోంశాఖ మార్గదర్శకాలపై మంత్రులు ఆళ్ల నాని, కన్నబాబు, సీఎస్‌ నీలంసాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్‌, వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహార్‌ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులతో శనివారం సీఎం క్యాంపు ఆఫీసులో సమీక్ష నిర్వహించారు. వివిధ రాష్ట్రాలు, విదేశాల్లో చిక్కుకున్న వారంతా తిరిగి రాష్ట్రానికి వస్తున్న నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహాలపై ప్రధానంగా చర్చించారు.

ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ ప్రతి గ్రామ సచివాలయాన్ని ఒక యూనిట్‌గా తీసుకొని కనీసం 10 నుండి 15 మందికి క్వారంటైన్‌ వసతి కల్పించాలని ఆదేశించారు. ఈ పరిస్థితుల్లో కనీసం లక్ష పడకలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. అంగన్ వాడీలు, మెప్మా, పంచాయతీరాజ్‌ విభాగాలు గ్రామాల్లో చర్యలు చేపట్టాలన్నారు. కనీసం ఐదొందల ఆర్టీసీ బస్సులను నిత్యావసరాలు తీసుకెళ్లే మొబైల్‌ వాహనాలుగా తీర్చిదిద్దాలని, ఇందులోనే వీలైనంత వరకు ఫ్రీజర్లు ఏర్పాటు చేయాలని తెలిపారు. పాలు, పెరుగు, గుడ్లు, పండ్లు వంటి నిత్యావసరాలు ఏర్పాటు చేయాలన్నారు. వైద్యుడు, ఏఎన్‌ఎం, ఆశా కార్యకర్త, మందులు మొబైల్‌ యూనిట్‌లో అందుబాటులో ఉండాలని ఆదేశించారు.

 కేంద్ర హోంశాఖ సూచనల మేరకు రాష్ట్రంలో కంటైన్‌మెంట్‌ జోన్లు గుర్తించామన్నారు. మే 30 వరకు రైతు భరోసా కేంద్రాలు ప్రారభించాలని, మార్కెట్‌ ఇంటెలిజెన్స్ వ్యవస్థను బలోపేతం చేయాలన్నారు. రాష్ట్ర, జిల్లా, మండలస్థాయిలో వ్యవసాయ సలహా బోర్డులు ఏర్పాటు చేయాలని, వీటన్నింటిపై విధివిధానాలు ఖారారు చేయాలని సూచించారు.