Breaking News

కరోనాకు మరో మందు

సారథిన్యూస్​, హైదరాబాద్​: కరోనా రోగులకు ఉపశమనం కలిగించేందుకు హెటిరో ఔషధ సంస్థ మరో మందును అందుబాటులోకి తెచ్చింది. శనివారం గ్లెన్మార్క్ ఫార్మా కంపెనీ ఫాబిఫ్లూ పేరుతో ఓ మందును విడుదల చేసింది. తక్కువ రోగ లక్షణాలు ఉన్నవారికి ఈ మెడిసిన్​ పనిచేస్తుందని వెల్లడించింది. కాగా తాజాగా హైదరాబాద్‌కు చెందిన హెటిరో ఫార్మా కంపెనీ కరోనా వైరస్‌కు జనరిక్ మందును కనిపెట్టినట్టు ప్రకటించింది. ‘కోవిఫర్’ పేరుతో ఈ మందును తయారు చేసినట్టు తెలిపింది. దీనికి డీసీజీఐ అనుమతి కూడా లభించినట్టు సంస్థ వెల్లడించింది. వెంటనే ఈ కోవిఫర్‌ను అందుబాటులోకి తీసుకొస్తామని హెటిరో ఫార్మా కంపెనీ పేర్కొన్నది. సామాన్యులకు కూడా అందుబాటులో ఉండే విధంగా తక్కువ ధరకే ఈ మందును అందుబాటులోకి తీసుకొస్తామని హెటిరో ప్రతినిధులు చెప్పారు. ఇంజెక్షన్ రూపంలో ‘కోవిఫర్ 100 ఎంజీ’ మార్కెట్లోకి రానున్నదని ఫార్మా కంపెనీ ప్రకటించింది. కోవిడ్ లక్షణాలు ఉన్నవారందరికీ ఈ ఇంజెక్షన్ పని చేస్తుందని తెలిపింది. అయితే ఈ జనరిక్ మందు ఏ స్థాయిలో రోగ లక్షణాలు ఉన్న వ్యక్తులకు పని చేస్తుందో స్పష్టత లేదు.