Breaking News

కరెంట్​ లేదు.. ఫోన్లు లేవు.. పాఠం ఎట్ల సార్లూ!

కరెంట్​లేదు.. ఫోన్లు లేవు.. పాఠం ఎట్ల సార్లూ!

సారథి న్యూస్, కౌడిపల్లి: కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో పేద విద్యార్థులు నష్టపోకుండా ఉండేందుకు ప్రభుత్వం సెప్టెంబర్​1 నుంచి ఆన్​లైన్ ​క్లాసెస్ ​చెప్పించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే సర్కారు ఆశయం గొప్పదే అయినా అందరి ఇళ్లలో టీవీలు లేకపోవడం, టీవీలు ఉన్నచోట సమయానికి కరెంట్​ లేకపోవడం పెద్ద సవాల్​గా మారింది. దీంతో విద్యార్థులు కరెంట్ ​కోసమే ఎక్కువ సేపు ఎదురుచూడాల్సి వస్తోంది. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం వెంకటాపూర్(ఆర్) గ్రామంలో 100 మంది 10వ తరగతి విద్యార్థులు టీవీలో ఆన్​లైన్ ​క్లాసెస్ చూద్దామంటే ఉదయం నుంచి 11:30 గంటల వరకు కరెంట్ రాలేదు. షెడ్యూల్​లో భాగంగా మంగళవారం మొదటిరోజు తెలుగు, భౌతికశాస్త్రం పాఠాలు వినాల్సి ఉంది. పాఠాలు వినకపోవడంతో వారంతా నిరాశకు గురయ్యారు. వీరికి ఎవరిలో కూడా స్మార్ట్​ ​ఫోన్స్ ​లేకపోవడంతో ఉన్నప్పుడే టీవీలో చూడాల్సిన పరిస్థితి నెలకొంది. మారుమూల గ్రామాలు, గిరిజన తండాల్లో టీవీలు లేక, స్మార్ట్​ ఫోన్లు లేక చాలామంది విద్యార్థులు ఆన్​లైన్ క్లాసెస్​కు దూరమవుతున్నారు. కొన్నిచోట్ల ఉపాధ్యాయులు విద్యార్థుల ఇళ్ల వద్దకు వెళ్లి పాఠాలు వింటున్నారా? లేదా? అని పరిశీలించారు.

మొదటి రోజు ఆన్​లైన్​క్లాస్​విందామనుకుంటే పొద్దటి నుంచి కరెంట్​లేకపోవడంతో టీవీ చూడలేకపోయాను. మాకు ఫోన్​కు కూడా లేదు. తెలుగు, భౌతికశాస్త్రం–2 క్లాసులను కోల్పోయాను. మున్ముందు కూడా కరెంట్​లేకపోతే అన్ని క్లాసులు మిస్సవుతానేమోనని బాధగా ఉంది.
:: ఐశ్వర్య, 10వ తరగతి విద్యార్థిని, వెంకటాపూర్(ఆర్)