Breaking News

ఒక్క‘మా’టై..

టాలీవుడ్ లో పనిచేసే సినీ ఆర్టిస్టుల కోసం ‘మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్’ (మా) 1993లో మెగాస్టార్ చిరంజీవి ఫౌండర్ ప్రెసిడెంట్​గా అక్కినేని నాగేశ్వర రావు చీఫ్ అడ్వయిజర్​గా ఏర్పడింది. నాటి నుంచి రెండేళ్లకు ఒకసారి ఎన్నికలు నిర్వహిస్తూ మూవీ ఆర్టిస్టుల సమస్యలపై నిర్ణయాలు తీసుకుంటూ వారి అభున్నతికి కృషిచేస్తూ వస్తున్నారు. గతేడాది ఎన్నికల్లో సీనియర్ నరేష్ వర్గం ‘మా’ ఎన్నికల్లో విజయం సాధించింది. నరేష్ ‘మా’ అధ్యక్షుడిగా.. రాజశేఖర్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ గా.. జీవిత జనరల్ సెక్రటరీగా ఎన్నికయ్యారు. అయితే కారణం తెలియకుండానే ‘మా’ అసోసియేషన్​లో నరేష్ వర్గమని ఓ వైపు, జీవితారాజశేఖర్ వర్గమని మరోవైపు రెండు చీలికలు ఏర్పడ్డాయి. వీళ్లు ఒకరికి తెలియకుండా ఒకరు మీటింగ్​లు పెట్టుకుంటూ నిర్ణయాలు తీసుకుంటూ ఒకరిమీద ఒకరు ఆధిపత్యం చూపించుకోడానికి ట్రై చేశారు. కానీ చాలామంది ఇండస్ట్రీ పెద్దలు నరేష్ ను తాత్కాలికంగా పక్కనపెట్టి జీవిత రాజశేఖర్ వర్గానికే ప్రాధాన్యమిస్తూ కార్యక్రమాలు నిర్వహించారు. అయితే రాజకీయాల్లో శాశ్వత శత్రువులు.. శాశ్వత మిత్రులు ఉండరన్నట్లు.. సినీ ఇండస్ట్రీలో ఇలాగే ఉండరంటూ నరేష్, జీవిత రాజశేఖర్ వర్గాలు ఒకటయ్యాయి. ఇకపై కలిసి పనిచేయడానికి నరేష్ నే మళ్లీ ‘మా’ అధ్యక్షుడిగా యాక్టివ్ గా ఉండేదుకు ఒక అంగీకారానికి వచ్చినట్లు సమాచారం.


గురువారం సినిమాటోగ్రఫీ మినిస్టర్ తలసాని ఆధ్వర్యంలో మాసబ్ ట్యాంక్ లోని కాన్ఫరెన్స్ హాల్ లో నిర్వహించిన సమావేశానికి కూడా ‘మా’ అధ్యక్షుడి హోదాలో సీనియర్ నరేష్.. ‘మా’ జనరల్ సెక్రటరీ హోదాలో జీవిత హాజరయ్యారు. అయితే ఇన్ని రోజులు వాళ్ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమన్న చందాన ఉన్న ఈ రెండు వర్గాలు సడన్ గా కలిసిపోవడానికి గల కారణాలేమీ ఇంకా తెలియలేదు. బహుశా ఇండస్ట్రీలో నెలకొన్న పరిస్థితులపై ఈ మధ్య ఇండస్ట్రీ ప్రముఖులు నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో ‘మా’కు ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో.. వీరు తమ ఉనికిని కాపాడుకోవడానికి మళ్లీ కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నారేమో అని అనుకుంటున్నారంతా.