Breaking News

ఏపీ సీఎం జగన్​ శ్రీశైలం టూర్​ రద్దు

ఏపీ సీఎం జగన్​శ్రీశైలం టూర్​రద్దు
  • శ్రీశైలం ఎడమగట్టు పవర్​హౌస్​ ప్రమాదంపై దిగ్భ్రాంతి
  • సహాయ సహకారాలు అందించాలని అధికారులకు ఆదేశాలు

సారథి న్యూస్​, కర్నూలు: ఆంధ్రప్రదేశ్​ సీఎం వైఎస్​ జగన్​మోహన్​రెడ్డి శుక్రవారం శ్రీశైలం పర్యటనను రద్దుచేసుకున్నట్లు సీఎంవో అధికారులు వెల్లడించారు. వరుసగా రెండవ ఏడాది శ్రీశైలంలోకి వరదనీరు భారీగా వస్తున్న నేపథ్యంలో రాయలసీమ సహా వివిధ ప్రాజెక్టులకు తాగు, సాగునీటి అవసరాలకు నీటి తరలింపు సహా ప్రాజెక్టు వద్ద పరిస్థితులను సమీక్షించేందుకు, అక్కడ పూజలు నిర్వహించేందుకు శుక్రవారం ముఖ్యమంత్రి వైఎస్​ జగన్​మోహన్​రెడ్డి శ్రీశైలం వెళ్లాల్సి ఉంది. అయితే శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణ రాష్ట్రం పరిధిలో ఉన్న ఎడమగట్టు భూగర్భ జలవిద్యుత్‌ కేంద్రంలో గురువారం రాత్రి అగ్నిప్రమాదం సంభవించిన విషయాన్ని సీఎంవో అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. జలవిద్యుత్‌ కేంద్రంలో చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని సీఎంకు వివరించారు.

ఇలాంటి పరిస్థితులు నేపథ్యంలో అక్కడకు వెళ్లి పూజలు నిర్వహించడం, సమీక్ష సమావేశాలు నిర్వహించడం సబబుకాదని సీఎం అధికారులతో అన్నారు. తెలంగాణ విద్యుత్‌ కేంద్రంలో జరిగిన ప్రమాదం పట్ల సీఎం దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. చిక్కుకుపోయిన వారు సురక్షితంగా బయటపడాలని ఆకాంక్షించారు. ఏపీ ప్రభుత్వం, యంత్రాంగం నుంచి ఎలాంటి సహాయం కోరినా వెంటనే వారికి అందించాలని ఆదేశాలు జారీచేశారు. ఈ నేపత్యంలో శ్రీశైలం పర్యటనను రద్దుచేయాల్సిందిగా ఆదేశాలు ఇచ్చారు. దీంతో సీఎం జగన్​టూర్​ను రద్దుచేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు.