Breaking News

ఏపీ ఎత్తిపోతలను అడ్డుకుంటం

  • అపెక్స్ కమిటీ ఆమోదం లేకుండా
  • కొత్త ప్రాజెక్టు కట్టడం తప్పదమే
  • ఏపీ ప్రభుత్వతీరు విభజన చట్టానికి విరుద్ధం
  • ‘కృష్ణా’ బోర్డులో ఫిర్యాదుచేస్తం
  • కనీసం మమ్మల్ని సంప్రదించలేదు
  • ఉన్నతస్థాయి సమావేశంలో సీఎం కేసీఆర్​

సారథి న్యూస్​, హైదరాబాద్​: శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కృష్ణానది నీటిని లిఫ్టు చేస్తూ కొత్త ఎత్తిపోతల పథకం నిర్మించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయించడం తీవ్ర అభ్యంతరకరమని తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్ రావు ఆక్షేపించారు. ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టానికి విరుద్ధమన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు తీవ్ర భంగకరమైన ఈ ప్రాజెక్టును అడ్డుకోవడానికి న్యాయపోరాటం చేస్తామని ప్రకటించారు. ఈ నిర్ణయంపై వెంటనే కృష్ణావాటర్ మేనేజ్​ మెంట్​ బోర్డులో ఫిర్యాదు చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. తెలంగాణ రాష్ట్రాన్ని సంప్రదించకుండానే ఉమ్మడి ప్రాజెక్టు అయిన శ్రీశైలం నీటి విషయంలో నిర్ణయం తీసుకోవడం, అపెక్స్ కమిటీ ఆమోదం లేకుండా కొత్త ప్రాజెక్టు నిర్మాణం తలపెట్టడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేసిన తప్పిదాలుగా సీఎం పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టును అడ్డుకోవడానికి రాజీలేని ధోరణి అవలంభిస్తామని స్పష్టంచేశారు.
శ్రీశైలం ప్రాజెక్టు నుంచి మూడు టీఎంసీల నీటిని లిఫ్టు చేసే విధంగా కొత్తఎత్తిపోతల పథకం చేపట్టేందుకు నిర్ణయించిన ఏపీ ప్రభుత్వం, దీనికి సంబంధించి జీవో కూడా విడుదల చేసింది. ఈ అంశంపై సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లో సోమవారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. మంత్రులు ఈటల రాజేందర్, మహమూద్ అలీ, శ్రీనివాస గౌడ్, నిరంజన్ రెడ్డి, జగదీశ్​ రెడ్డి, పువ్వాడ అజయ్, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, నీటి పారుదల సలహాదారు ఎస్​ కే జోషి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, నీటి పారుదలశాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్, ఈఎన్​సీ మురళీధర్, ఏజీబీఎస్ ప్రసాద్, అడిషనల్ ఏజీ రాంచందర్ రావు, లీగల్ కన్సల్టెంట్ రవీందర్ రావు, రిటైర్డ్ ఇంజనీర్లు శ్యాం ప్రసాద్ రెడ్డి, చంద్రమౌళి, సీఎంవో కార్యదర్శి స్మితా సభర్వాల్, ఓఎస్డీ శ్రీధర్ దేశ్ పాండే, నీటి పారుదల శాఖ సీనియర్ ఇంజనీర్లు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టిన కొత్త ప్రాజెక్టుపై విస్తృతంగా చర్చించారు.

కనీసం సంప్రదించలేదు
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టనున్న ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు భంగకరం కావునా దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ న్యాయపోరాటం చేస్తామని ప్రకటించారు. ‘తెలంగాణలో కానీ, ఆంధ్రప్రదేశ్ లో కానీ కొత్త నీటి పారుదల ప్రాజెక్టు నిర్మాణం చేపడితే అపెక్స్ కమిటీ అనుమతి తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం స్పష్టంగా పేర్కొంది. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అపెక్స్ కమిటీ ఆమోదం తీసుకోలేదు. శ్రీశైలం ప్రాజెక్టు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించిన ఉమ్మడి ప్రాజెక్టు. ఇందులోని నీటిని రెండు రాష్ట్రాలు వాడుకోవాలి. కానీ తెలంగాణ రాష్ట్రాన్ని కనీసం సంప్రదించకుండా శ్రీశైలం ప్రాజెక్టులోని నీటిని లిఫ్టుచేయాలని నిర్ణయించి, జీవో జారీచేసింది. ఇది తీవ్ర అభ్యంతకరం. కృష్ణానీటిని తరలించుకుపోతే ఉమ్మడి పాలమూరు, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలకు సాగు, తాగు నీటి సమస్య ఏర్పడుతుంది. అందుకే ఈ ప్రాజెక్టు నిర్మాణం జరగకుండా ఆదేశాలు జారీ చేయాలని వెంటనే కేఆర్ఎంబీలో ఫిర్యాదు చేస్తాం’’ అని సిఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
ఏపీకి స్నేహహస్తం అందించినం
‘గతంలో ఉన్న వివాదాలు, విబేధాలను పక్కనబెట్టి రెండు రాష్ట్రాల రైతుల ప్రయోజనాలు కాపాడడమే లక్ష్యంగా నదీ జలాలను వినియోగించుకుందామని తెలంగాణ ప్రభుత్వం ఏపీకి స్నేహహస్తం అందించింది. బేసిన్లు, బేషజాలు లేకుండా నీటిని వాడుకుందామని నేనే చొరవ చూపించిన. అయినప్పటికీ ఏపీ ప్రభుత్వం కనీసం తెలంగాణ ప్రభుత్వాన్ని సంప్రదించకుండా శ్రీశైలంలో నీటిని లిఫ్టు చేయడానికి ఏకపక్షంగా కొత్త పథకం ప్రకటించడం అత్యంత బాధాకరం. పరస్పర సహకారంతో నీటిని వాడుకుందామనే స్ఫూర్తికి ఇది విఘాతం కలిగించింది. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగితే రాజీ పడే ప్రసక్తే లేదు. ఏపీ తలపెట్టిన కొత్త ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకుని తీరడమే లక్ష్యంగా న్యాయపోరాటం చేస్తాం’ అని సిఎం కేసీఆర్ ప్రకటించారు.
సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాం
కృష్ణానదిలో రాష్ట్రాల వాటాను తేల్చే విషయంలో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ లో చాలా జాప్యం జరుగుతున్నందున, సత్వర న్యాయం కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. గోదావరి నది నికర జలాల్లో తెలంగాణ రాష్ట్రానికి ఉన్న 950 టీఎంసీల నీటిని వాడుకోవడానికి అనుగుణంగా ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతోంది. తెలంగాణకు ఇంకా నీటి అవసరం ఉంది. మంచినీటి అవసరాలకు, పారిశ్రామిక అవసరాలు, విద్యుత్ ప్లాంట్లకు నీరు కావాలి. కాబట్టి గోదావరి మిగులు జలాల్లో తెలంగాణకు 600 టీఎంసీలను కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాలని సీఎం అధికారులను ఆదేశించారు. రోజుకు రెండు టీఎంసీల నీటిని లిఫ్టు చేయడానికి ఉద్దేశించిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని సత్వరం పూర్తిచేయాలని అధికారులను ఆయన ఆదేశించారు.