![ఎమ్మెల్యే.. ‘ఆల’ అలా..](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/08/MLA-2F.jpg?fit=677%2C305&ssl=1)
సారథి న్యూస్, దేవరకద్ర: మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం గూరకొండ సమీపంలోని బండర్ పల్లి బ్రిడ్జి వద్ద ఆదివారం సాయంత్రం ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి కొద్దిసేపు సందడి చేశారు. కాసేపు గాలంతో చేపలు పట్టారు. చిన్నచింతకుంట మండలంలో జరిగిన పలు కార్యక్రమాలకు హాజరైన ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి తిరుగు ప్రయాణంలో బండర్పల్లి వద్ద ఆగారు. అక్కడే చేపలు పడుతున్న వారి వద్దకు వెళ్లి గాలం తీసుకుని చేపలుపట్టారు. వాటిని చేతిలోకి తీసుకుని చూసి ముచ్చటపడ్డారు. తిరిగి మళ్లీ వాగులోకి విడిచిపెట్టారు. వివిధ కార్యక్రమాల్లో ఎప్పుడూ బిజీగా ఉండే ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి బండర్ పల్లి వద్ద సరదాగా చేపలు పట్టడాన్ని ఆ మార్గంలో వచ్చిపోయే వారు చూస్తుండిపోయారు.