Breaking News

ఉత్తమ అధికారిగా కలెక్టర్ అమయ్ కుమార్

సారథి న్యూస్​, హైదరాబాద్​: ప్రముఖ సంస్థ ఫేమ్ ఇండియా దేశవ్యాప్తంగా చేసిన సర్వేలో దేశంలోనే 50 మంది ఉత్తమ ఐఏఎస్ అధికారులను ఎంపికచేసింది. ఈ టాప్ 50 లో తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఇద్దరు ఐఏఎస్ అధికారులు ఉన్నారు. వారిలో ఒకరు రంగారెడ్డి కలెక్టర్ అమయ్ కుమార్ కాగా, ఇంకొకరు కరీంనగర్ కలెక్టర్ శశాంక. ఫేమ్ ఇండియా సంస్థ వీరిద్దరి గత నాలుగు నెలల పనితనం ఆధారంగా ఈ జాబితాకు ఎంపిక చేసింది. కరోనా నియంత్రణలో భాగంగా ఈ రెండు జిల్లాల కలెక్టర్లు రేయింబవళ్లు అప్రమత్తంగా ఉండి ఆయా జిల్లాల ప్రజల్లో వ్యాధి నివారణపై చైతన్యం కలిగిస్తూ జాగ్రత్తలు పాటించేలా కఠినచర్యలు తీసుకున్నారు.

కరోనా అడ్డుకట్టకు వినూత్న విధానం
ముఖ్యంగా రంగారెడ్డి కలెక్టర్ అమయ్ కుమార్ కరోనా కట్టడికి వినూత్న పద్ధతులను అవలంభించారు. ట్రేస్, టెస్ట్, ఐసోలేట్, సపోర్ట్ అనే విధానాన్ని రంగారెడ్డి జిల్లా అంతటా అమలుచేసి ఎక్కడికక్కడ కరోనా కేసు నమోదైన ప్రాంతాన్ని ఐసోలేట్ చేసి ఆ ప్రాంతంలో ఆ కేసుతో సంబంధం ఉన్న వ్యక్తులను ట్రేస్ చేసి వారిని ఐసోలేట్ చేసి వారికి అన్ని రకాలుగా మద్దతుగా నిలుస్తూ మళ్లీ వారికి టెస్ట్ చేసిన తర్వాత పాజిటివ్ వచ్చిన కేసులను ఆస్పత్రికి తరలించారు. ఆ పాజిటివ్ కేసులు వచ్చిన వారితో సంబంధమున్న వ్యక్తులను ట్రేస్ చేసి ఆ సంబంధీకులను కూడా క్వారంటైన్ చేశారు. ఇలా క్రమం తప్పకుండా జిల్లా యంత్రాంగాన్ని ఇదే పద్ధతిలో పనిచేసే విధంగా వారిని సమాయత్తం చేసి అద్భుతమైన ఫలితాలు రాబట్టారు. రంగారెడ్డి జిల్లాలో తెలంగాణకు కీలక ఆర్థిక వనరులను అందించే ఐటీ పరిశ్రమ ఉండడంతో పాటు అంతర్జాతీయ విమానాశ్రయం కూడా ఉండడంతో పాజిటివ్ కేసులు వచ్చిన ప్రాంతమంతా కఠినమైన నిబంధనలు అమలు చేస్తూ, జిల్లా అంతటా వలస కార్మికుల విషయంలో కూడా ప్రత్యేకమైన శ్రద్ద తీసుకున్నారు. అందుకే దేశ ఉత్తమ ఐఏఎస్ అధికారుల్లో ఒకరిగా ఎంపికయ్యారు.