Breaking News

ఈ గుండెను తాకిపో తాతా..

  • ఎన్టీఆర్ ఎమోషనల్ ట్వీట్

విశ్వవిఖ్యాత నటసార్వభౌముడిగా తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన స్వర్గీయ నందమూరి తారక రామారావు పుట్టినరోజు మే 28.. ఆయన వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న ఆయన మనవడు జూనియర్ ఎన్టీఆర్ గురువారం ఎన్టీఆర్​ జయంతి సందర్భంగా తాతకు నివాళులర్పించాడు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా తన భావాలను షేర్ చేసుకున్నాడు. ‘మీ పాదం మోపక తెలుగు ధరిత్రి చిన్నబోతోంది, మీ రూపు కానక తెలుగు గుండె తల్లడిల్లిపోతోంది, పెద్ద మనసుతో ఈ ధరిత్రిని, ఈ గుండెను మరొక్కసారి తాకిపో తాతా.. సదా మీ ప్రేమకు బానిసను’అంటూ విపరీతమైన భావోద్వేగానికి లోనవుతూ.. ఎన్టీఆర్ ఫొటోను పోస్ట్ చేసి ‘మీరు లేని లోటు తీరనిది..’ అంటూ ఎమోషనల్ ట్వీట్ చేశాడు. ఎన్టీఆర్ జయంతి, వర్ధంతికి ఎవ్రీ ఇయర్ హైదరాబాద్ లోని ఆయన ఘాట్ వద్దకు వెళ్లి నివాళులర్పిస్తాడు తారక్. కానీ ఇప్పుడు లాక్ డౌన్ పరిస్థితుల నేపథ్యంలో ఈ జయంతికి ఇంటి నుంచే తాత గారికి నివాళులు అర్పించాడు.

‘తెలుగుజాతి పౌరుషం, తెలుగు వారి ఆత్మగౌరవం.. తెలుగు నేల గుండెల్లో ఎన్నటికీ చెక్కు చెదరని జ్ఞాపకం నందమూరి తారక రామారావు కీర్తి అజరామరం.. వారితో కలిసి నటించడం నా అదృష్టం.. పుట్టినరోజు నాడు ఆ మహానుభావుడిని స్మరించుకుంటూ..’ అంటూ మెగాస్టార్ చిరంజీవి తన ఎన్టీఆర్ కలిసి నటించిన ‘తిరుగులేని మనిషి’ సినిమా సంఘటనలను గుర్తు చేసుకుంటూ ట్విట్టర్​లో ఎన్టీఆర్.. చిరంజీవి ఒకరికొకరు స్వీట్ తినిపించుకుంటున్న ఫొటోను షేర్ చేశారు. ఈ సందర్భంగా తెలుగు ఇండస్ట్రీ యావత్తూ ఎన్టీఆర్ కు నివాళులు అర్పించారు.