Breaking News

ఇంటికే రేషన్​ బియ్యం

  • సెప్టెంబర్ 1 నుంచి బియ్యం డోర్ డెలివరీ
  • ఏపీ సీఎం వైఎస్‌జగన్‌ ఆదేశాలు

సారథి న్యూస్, అనంతపురం: ప్రజాపంపిణీ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన ఏపీ సీఎం వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డి సెప్టెంబర్​ 1వ తేదీ నుంచి నాణ్యమైన బియ్యాన్ని లబ్ధిదారుల ఇంటికే డోర్‌డెలివరీ చేయాలని అధికారులను ఆదేశించారు. అదే రోజు నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకాన్ని అమల్లోకి తీసుకురావాలని స్పష్టం చేశారు. కరోనా(కోవిడ్‌–19) నివారణ చర్యలపై సమీక్షలో భాగంగా పౌరసరఫరాల శాఖ అధికారులకు సీఎం ఆదేశాలు జారీచేశారు. సీఎం ఆదేశాలతో నాణ్యమైన బియ్యం రాష్ట్రవ్యాప్తంగా డోర్‌డెలివరీ చేయడానికి పౌరసరఫరాల శాఖ సిద్ధమవుతోంది.
ప్రజాపంపిణీపై ప్రత్యేకదృష్టి
ఏపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాపంపిణీ వ్యవస్థపై ప్రభుత్వం ప్రత్యేకదృష్టి సారించింది. రేషన్‌పంపిణీలో ఉన్న లోటుపాట్లను సరిదిద్ది అవినీతిని రూపుమాపడంతో పాటు పారదర్శకత కోసం ప్రత్యేకచర్యలు చేపట్టింది. దీనికోసం ప్రత్యేకంగా బియ్యం కార్డులను తీసుకొచ్చింది. గ్రామ, వార్డు సచివాలయాల్లో అర్హులైన వారందరికీ కార్డులు మంజూరుచేసే వ్యవస్థనూ మొదలుపెట్టింది. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ బియ్యం అందించేందుకు సామాజిక తనిఖీలో భాగంగా సచివాలయాల్లో లబ్ధిదారుల జాబితాను ఉంచడమే కాకుండా, పేరులేని వారు ఎవరికి దరఖాస్తు చేయాలన్న దానిపై కూడా వివరాలు ఉంచింది. వాటి ఆధారంగా దరఖాస్తు చేసిన వారివి కూడా పరిశీలించి వారికి బియ్యం కార్డులను అధికారులు మంజూరుచేశారు. దీన్ని ఇంతటితో వదిలేయకుండా అర్హత ఉన్న వారికి బియ్యం కార్డులు మంజూరు అన్నది నిరంతర ప్రక్రియగా ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.

నాణ్యతపై రాజీ లేదు
అంతేకాకుండా బియ్యం నాణ్యతపైన కూడా ప్రత్యేక దృష్టిపెట్టింది. ప్రభుత్వం పంపిణీ చేస్తున్న రేషన్‌బియ్యం తినలేని విధంగా ఉండడంతో వాటిని దళారులకు అమ్ముకునేవారు. మళ్లీ ఆ బియ్యాన్ని రీసైక్లింగ్‌చేసి మరలా మార్కెట్​ లోకి తీసుకొచ్చేవారు. దీంతో పేదలకు నాణ్యమైన బియ్యం అందకపోవడంతో పాటు అవినీతి చోటుచేసుకునేది. ఎన్నికల హామీల్లో భాగంగా నాణ్యమైన, తిన గలిగే, రుచికరమైన బియ్యాన్ని డోర్‌డెలివరీ చేస్తామని సీఎం వైఎస్‌జగన్‌మోహన్​రెడ్డి హామీఇచ్చారు.
శ్రీకాకుళంలో పైలట్​ ప్రాజెక్టు
రాష్ట్రవ్యాప్తంగా నాణ్యమైన బియ్యాన్ని డోర్‌డెలివరీ చేసే కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాలో దీన్ని పైలట్‌ప్రాజెక్టుగా చేపట్టింది. బియ్యాన్ని సేకరించడం, ఆ బియ్యాన్ని ప్యాక్‌చేయడం, ఇంటికే డోర్‌డెలివరీ చేయడాన్ని ప్రయోగాత్మకంగా అమలుచేస్తోంది. వాటిని అందుకుంటున్న వారి నుంచి అభిప్రాయాలు కూడా స్వీకరించింది. ప్రజలు కూడా పెద్ద ఎత్తున సంతృప్తి వ్యక్తంచేశారు. కార్యక్రమం అమల్లో ఎదురవుతున్న సమస్యలు, వాటిని పరిష్కరించి మరింత మెరుగ్గా, పటిష్టంగా అమలుచేయడంపై ఎప్పటికప్పుడు అధికారులు సమీక్ష చేసుకుని ఇప్పుడు పకడ్బందీ విధానాన్ని రూపొందించుకున్నారు. ఎక్కడెక్కడ ధాన్యం సేకరించాలి, వాటిని శుద్ధిచేయడమెలా, అదేసమయంలో కల్తీ లేకుండా చూసుకునేలా ఈ విధానాన్ని తీర్చిదిద్దారు.
డోర్‌ డెలివరీ ఇలా చేస్తాం..
నాణ్యమైన బియ్యం డోర్‌డెలివరీని శ్రీకాకుళం జిల్లాలో ఇంటింటికీ మొదలుపెట్టామని సివిల్‌సప్లయీస్​ కమిషనర్ కోన శశిధర్ తెలిపారు. ‘గతేడాది సెప్టెంబర్​ 6 నుంచి జిల్లాలో ఇది అమలవుతోంది. పైలట్‌ప్రాజెక్టులో మాకు ఎదురైన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటికీ నాణ్యమైన బియ్యాన్ని డోర్‌డెలివరీ చేయనున్నాం. పర్యావరణ సంబంధిత అంశాలనూ పరిగణలోకి పరిగణలోకి తీసుకున్నాం. లబ్ధిదారులకు పారదర్శక పద్ధతిలో, అవినీతికి తావులేకుండా, నాణ్యమైన బియ్యాన్ని అందించడమే లక్ష్యంగా ఈ విధానాన్ని ఏర్పాటు చేసుకున్నాం. గోడౌన్ల నుంచి వచ్చే ప్రతి గన్నీ బ్యాగుపై కూడా స్ట్రిప్‌సీల్‌ఉంటుంది. అలాగే ప్రతి బ్యాగుపైనా బార్‌కోడ్‌ఉంటుందని తెలిపారు. కల్తీ లేకుండా, రవాణాలో అక్రమాలు జరగకుండా ఈ జాగ్రత్తలు తీసుకున్నాం. అన్ని గ్రామ సచివాలయాల్లో అందుబాటులో ఉండేలా 13,370 మొబైల్‌యూనిట్లను పెడుతున్నాం. ఇందులోనే ఎలక్ట్రానిక్‌వేయింగ్‌మెషిన్‌ఉంటుంది. ఈ మొబైల్‌యూనిట్ల ద్వారా ప్రతి లబ్ధిదారుడి ఇంటికివెళ్లి బియ్యాన్ని డోర్‌డెలివరీ చేస్తాం. లబ్ధిదారుల ముందే బియ్యం బస్తా సీల్‌ను ఓపెన్‌చేసి వారికి నిర్దేశించిన కోటా ప్రకారం బియ్యాన్ని అందిస్తాం. బియ్యాన్ని తీసుకోవడంకోసం లబ్ధిదారునికి నాణ్యమైన సంచులను ఉచితంగా అందిస్తున్నాం. ప్రతినెలా 2.3లక్షల మెట్రిక్‌టన్నుల నాణ్యమైన బియ్యాన్ని డోర్‌డెలివరీ చేయడానికి నిర్ణయించాం’ అని కోన శశిధర్‌తెలిపారు.