Breaking News

ఆర్సీబీకి ఘోర పరాజయం

ఆర్సీబీకి ఘోర పరాజయం

దుబాయ్‌: ఐపీఎల్​13వ సీజన్​లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో దుబాయ్​ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ 59 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముందుగా టాస్‌ గెలిచిన ఆర్సీబీ ఫీల్డింగ్​ ఎంచుకుంది. బ్యాటింగ్ ​చేపట్టిన ఢిల్లీ 197 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. పృథ్వీషా(42;23 బంతుల్లో 5 ఫోర్లు, 2సిక్స్‌లు), శిఖర్‌ ధావన్‌(32; 28 బంతుల్లో 3 ఫోర్లు), స్టోయినిస్‌( 53 నాటౌట్‌; 26 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), రిషభ్‌ పంత్‌(37; 25 బంతుల్లో 3 ఫోర్లు, 2సిక్స్‌)లు రాణించడంతో ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 196 రన్స్​ చేయగలిగింది. ఆర్సీబీ బౌలర్లలో సిరాజ్‌ 2 వికెట్లు, మొయిన్‌ అలీ, ఉదానాకు చెరో వికెట్‌ దక్కింది.
ఇక లక్ష్య ఛేదనకు దిగిన ఆర్సీబీ టపటపా వికెట్లను చేజార్చుకుంది. ఆర్సీబీ ఆటగాళ్లలో విరాట్‌ కోహ్లి(43; 39 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌) మినహా ఎవరూ ఆకట్టుకోలేదు. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 137 పరుగులకే పరిమితమై ఓటమిని మూటగట్టుకుంది. ఢిల్లీ బౌలర్లలో రబడా 4 వికెట్లు సాధించాడు. అక్షర్‌ పటేల్‌, నోర్త్‌జేలు చేరో 2 వికెట్ల చొప్పున తీశారు. అశ్విన్‌కు మరో వికెట్‌ లభించింది.