Breaking News

అలంపురం.. దివ్యధామం

తెలంగాణ రాష్ట్రంలో ఏకైక శక్తి పీఠం అలంపూర్‌ జోగుళాంబ ఆలయం. ఇది గద్వాల పట్టణానికి 55 కి.మీ., కర్నూలు జిల్లా కేంద్రానికి 20 కి.మీ. చేరువలో ఉంది. ఇక్కడి శిల్పసౌందర్యాన్ని వీక్షించడానికి దేశవిదేశాల నుంచి అధిక సంఖ్యలో వస్తుంటారు. అన్ని క్షేత్రాలు, ఆలయాలకు సంప్రదాయాలకు భిన్నంగా షణ్మతాలకు నిలయంగా అలంపురం విరాజిల్లుతోంది. ఈ క్షేత్రం దక్షిణకాశీ, పర శురామ క్షేత్రం, భాస్కర క్షేత్రంగా భాసిల్లుతోంది. ప్రపంచంలోనే మరెక్కడా లేని విధంగా అలంపూరంలో నవబ్రహ్మ ఆలయాలు ఉన్నాయి. బ్రహ్మదేవుడికి ప్రత్యేకమైన విగ్రహాలు ఉండడం, వాటికి నిత్యం ఆగమ సంప్రదాయ రీతిలో పూజలు చేయడం కూడా విశేషం. భక్తులు ఈ క్షేత్రాన్ని సందర్శిస్తే వారణాశి, (కాశీ)ని సందర్శించిన ఫలితం లభిస్తుందని స్కందపురాణం చెబుతోంది.

జోగుళాంబ అమ్మవారిని దర్శించుకుంటున్న భక్తులు

ప్రధాన ఆలయంలో బాలబ్రహ్మేశ్వరుడు ప్రధాన దేవతామూర్తి. కాశీలో విశ్వేశ్వరుడు, అలంపూర్‌లో బాలబ్రహ్మేశ్వరుడు వెలసి ఉన్నారు. అక్కడ కాశీ.. ఇక్కడ హేమలాపురం. అలంపురం పూర్వనామం హేమలాపురం. అయితే ఇది కాలక్రమేణా రూపాంతరం చెందుతూ హేమలాపురం, హతంపురం, యోగుళాపురం, జోగుళాపురం అని రూపాంతరం చెందుతూ ప్రస్తుతం అలంపురం క్షేత్రంగా వ్యవహారంలోకి వచ్చింది. కాశీలో ఉత్తరవాహిని గంగానది.. అయితే అలంపురంలో ఉత్తర వాహిని తుంగభద్రా నది. కాశీలో ఉన్నట్లే అలంపురంలో కూడా 64 స్నానఘట్టాలు ఉన్నాయి. అష్టాదశశక్తి పీఠాల్లో 5వ శక్తిపీఠంగా జోగుళాంబదేవి అలంపురంలో వెలిసింది.
గోష్పాద ముద్రిత లింగం
సర్వసాధారణంగా లింగాలు స్థూపాకారంగా ఉంటాయి. కానీ అలంపురక్షేత్రంలో మాత్రం బాలబ్రహ్మేశ్వరుడు గోష్పాద ముద్రిత రసాత్మక లింగంగా వెలసి ఉన్నాడు. ఆవు పాదం మోపితే ఎలాంటి ఆకృతి ఉంటుందో అదే ఆకృతిలో ఇక్కడ విగ్రహం వెలసి ఉంటుంది. పూర్వం ఈ విగ్రహంలో అనేకమైన రసాలు వెలువడుతుండగా రససిద్ధులు కొందరు ‘పరశువేది’ అనే మూలికసహాయంతో ఆ రసాలను మిళితం చేస్తూ ఈ విగ్రహంలో నుంచి బంగారాన్ని తయారుచేశారట. శైవక్షేత్రాలకు తలమానికంగా ఉన్న శ్రీశైల క్షేత్రానికి పశ్చిమద్వారంలో అలంపురం, ఉత్తరాన ఉమామహేశ్వరం, తూర్పున త్రిపురాంతకం, దక్షిణాన సిద్దవటం వెలసి ఉన్నాయి. చాళుక్యుల వంశంలో రెండవ పులకేశి ఈ ఆలయాలను నిర్మించినట్టు ఇక్కడ లభించే శిలాశాసనాల ద్వారా తెలుస్తోంది.
బాలబ్రహ్మేశ్వరుడు
పూర్వం బ్రహ్మదేవుడు ఇక్కడ తపస్సు చేయడం ద్వారా పరమేశ్వరుడు ఉద్భవించాడు. బ్రహ్మకారణం చేత పరమేశ్వరుడు వెలసినందుకు ఈ స్వామిని బ్రహ్మేశ్వరుడని, విగ్రహం చిన్నదిగా ఉండడంతో బాలబ్రహ్మేశ్వరుడు అని పిలుస్తారు. ఈ విగ్రహానికి ఆనుకుని విష్ణువుకు ప్రతిరూపమైన సాలగ్రామం వెలసింది. అందుకే శివాయ విష్ణు రూపాయ… శివరూపాయ విష్ణవే…అంటూ ఈ శైవక్షేత్రంలో ధనుర్మాస పూజలు కూడా నిర్వహిస్తారు.
పాపవినాశి తీర్థం
అలంపురానికి దక్షిణాన అరమైలు దూరంలో 24 ఆలయాల సముదాయమైన పాపనాశిని తీర్థం ఉంది. అది అష్టాదశ తీర్థాల్లో ఎంతో ప్రాముఖ్యం గలది. మిగిలిన తీర్థాలు చాలా వరకు శిథిలావస్థలో ఉన్నాయి. 24 ఆలయాల సముదాయం.. ప్రశాంతమైన వాతావరణంలో ఆధ్యాత్మికతలో తులతూగుతోంది. ప్రధాన ఆలయానికి చుట్టూ చిన్న, చిన్న గుడులు నిర్మించారు. ద్రావిడ, వేసర సంప్రదాయాలకు చెందిన ఆలయాలుగా వీటిని గుర్తించారు. ఈ ఆలయానికి ఉత్తర, దక్షిణ మూలలలో చక్కని ఆలయాలు, మండపాలు ఉన్నాయి. వాటిలో స్తంభాల పైన రామాయణ గాథ శిల్పాలు, క్షీరసాగర మథనం, అపూర్వ రమణీయతలను చాటుతున్నాయి. ఈ తీర్థం శ్రీశైలం ప్రాజెక్టు బ్యాక్​ వాటర్​లో మునిగిపోయినందున అక్కడి నుంచి కిలోమీటర్‌ దూరంలో ఈ పాప వినాశిని పునఃనిర్మాణం చేశారు.
నవబ్రహ్మ ఆలయాలు
ప్రధాన ఆలయ ఆవరణలోనే నవబ్రహ్మ ఆలయాలు కూడా ఉన్నాయి. ఇందులో బాల, కుమార, అర్క, వీర, విశ్వ, తారక, గరుడ, పద్మ, సర్గ బ్రహ్మేశ్వర ఆలయాలు నిర్మించారు. ఈ ఆలయాల మీద అష్ట దిక్పాలకులు, శివ, విష్ణు అవతారాలు, నటరాజు, పురాణ కథా శిల్పాలు, ముగ్ధమనోహరంగా భావ గాంభీర్యం చెడకుండా సృష్టించారు. ఈ శిల్పసౌందర్యం దేశ విదేశ విద్వాంసులు నుంచి ప్రశంసలు పొందింది. గరుడ, గంధర్వ, కిన్నెర కింపురుషాది మూర్తులు చూపరులకు రమణీయంగా నిలిచాయి. ఇక్కడి శిల్పాలపైన మానవ మిథునాలు, పంచతంత్ర కావ్య కథాశిల్పాలు ఆదిత్యహృదయం, రామాయణ, మహాభారత శిల్పాలు కనువిందు చేస్తాయి. ఈ ఆలయాలపై శ్రీమార, నయన, ప్రియన్, కంఠాచార్యన్‌ తదితర శిల్పాచార్యుల పేర్లు ఇప్పటికీ కనిపిస్తాయి. సమీపంలో యోగనారసింహస్వామి ఆలయం ఉంది. దీనిని ప్రహ్లాద రాయలు నిర్మించారు. లక్ష్మీదేవి, గణపతి, ఆళ్వారులు, అనంత పద్మనాభస్వామి, ఆంజనేయస్వామి వెలసి ఉన్నారు. 14వ శతాబ్దంలో నిర్మించిన సూర్యనారాయణ స్వామి ఆలయం కూడా ఉంది. భక్తుల కొంగుబంగారంగా వెలుగొందిన జోగుళాంబ అమ్మవారికి ప్రత్యేక పర్వదినాలు, పండగల వేళ విశేషపూజా కార్యక్రమాలు జరిపిస్తుంటారు. ఎంతో విశిష్టత కలిగిన ఆలయాలను మీరూ సందర్శించండి.

:: దిండిగల్‌ ఆనంద్‌శర్మ
సెల్​: 96660 06418