Breaking News

అపెక్స్ కౌన్సిల్ మీటింగ్​లో ఎండగట్టండి

అపెక్స్ కౌన్సిల్ మీటింగ్​లో ఎండగడదాం

  • నదీ జలాల విషయంలో కావాలనే ఏపీ కయ్యం
  • నీటిపారుదల శాఖ అధికారులకు సీఎం కేసీఆర్​ దిశానిర్దేశం

సారథి న్యూస్, హైదరాబాద్: అక్టోబర్​ 6న జరిగే అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు బుధవారం ప్రగతిభవన్ లో నీటిపారుదల శాఖ అధికారులతో ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటుచేశారు. తెలంగాణ నీటిపారుదల శాఖకు సంబంధించిన సమగ్ర వివరాలను, కేంద్రానికి చెప్పాల్సిన అన్ని విషయాలకు సంబంధించిన వివరాలను తీసుకుని సమావేశానికి రావాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నదీజలాల విషయంలో కావాలనే కెలికి కయ్యం పెట్టుకుంటున్నది. అపెక్స్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేస్తున్న వాదనలకు దీటైన సమాధానం చెప్పాలి. మళ్లీ తెలంగాణ జోలికి రాకుండా వాస్తవాలను కుండబద్ధలు కొట్టినట్లు స్పష్టం చేయాలి. అదే సందర్భంలో కేంద్ర ప్రభుత్వ నిష్క్రియాపరత్వాన్ని, ఏడేళ్ల అలసత్వాన్ని ఈ సమావేశంలో ఎండగట్టాలి. తెలంగాణ ప్రజల హక్కులను హరించడానికి జరుగుతున్న ప్రయత్నాన్ని ప్రతిఘటించాలి. నిజానిజాలను ఈ సమావేశం సందర్భంగా యావత్ దేశానికి తేటతెల్లం చేయాలి’ అని సీఎం కేసీఆర్​ సూచించారు.
ప్రధానికి రాసిన లేఖపై ఏది స్పందన?
‘రాష్ట్రాల పునర్విభజన చట్టాల ప్రకారం దేశంలో ఎప్పుడైనా కొత్త రాష్ట్రం ఏర్పడితే వెంటనే ఆ రాష్ట్రానికి జరిగే నీటిని కేటాయించాలి. తెలంగాణ రాష్ట్రం 2014 జూన్ 2న ఏర్పడితే జూన్ 14న ప్రధాన మంత్రికి లేఖ రాశాం. తెలంగాణ రాష్ట్రానికి నీటి కేటాంయిపులు జరపాలని కోరాం. ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్పూట్ యాక్ట్ 1956 సెక్షణ్ 3 ప్రకారం ప్రత్యేక ట్రిబ్యూనల్ వేసైనా, లేదంటే ఇప్పుడున్న ట్రిబ్యూనల్ ద్వారా అయినా తెలంగాణాకి నీటి కేటాయింపులు జరపాలని కోరాం. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల మధ్యనైనా, లేదంటే నదీపరివాహాల ప్రాంతాల్లోని మొత్తం రాష్ట్రాల మధ్య నీటి పంపిణీ జరపాలని కోరాం. ఏడేళ్లు గడిచినా ప్రధాన మంత్రికి రాసిన లేఖకు ఇప్పటివరకు స్పందన లేదు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఉలుకు పలుకు లేదు. పైగా అపెక్స్ సమావేశాల పేరిట ఏదో చేస్తున్నట్టు అనిపిస్తున్నారు. కానీ కేంద్రం ఏమీ చేయడం లేదు. 6న జరిగే అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని కూడా గట్టిగా ఎండగట్టాలి. తెలంగాణకు నీటి కేటాయింపుల విషయంలో స్పష్టత ఇవ్వాలని పట్టుబట్టాలి’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులకు సూచించారు. తెలంగాణ రాష్ట్రం కోరుతున్న న్యాయమైన డిమాండ్ల విషయంలో అవసరమైన అన్ని వాదనలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి కోరారు.