Breaking News

హైదరాబాద్​లో మళ్లీ లాక్​డౌన్​

హైదరాబాద్​లో మళ్లీ లాక్​డౌన్​
  • వైద్యారోగ్యశాఖ నుంచి ప్రతిపాదనలు
  • పరిశీలించి నిర్ణయం తీసుకుంటామన్న సీఎం కేసీఆర్​

సారథి న్యూస్, హైదరాబాద్: ‘హైదరాబాద్ కోటి మంది నివసిస్తున్న చాలా పెద్ద నగరం. దేశవ్యాప్తంగా అన్ని నగరాల్లో వైరస్ వ్యాప్తి ఎక్కువుతున్న క్రమంలో హైదరాబాద్ లోనూ అదే పరిస్థితి ఉండడం సహజం. లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత, ప్రజల కదలిక పెరిగింది. దీంతో వైరస్ వ్యాప్తి జరుగుతోంది. తమిళనాడు రాజధాని చెన్నైలో వైరస్ వ్యాప్తిని నివారించడానికి మళ్లీ లాక్ డౌన్ విధించారు. దేశంలో ఇతర నగరాలు కూడా ఇదే దిశగా ఆలోచన చేస్తున్నాయి. హైదారాబాద్ లో కూడా 15 రోజుల పాటు లాక్ డౌన్ విధించడం మంచిదనే ప్రతిపాదనలు వైద్యశాఖ నుంచి వస్తున్నాయి..’ అని తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్​రావు అన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నివారణ, వైరస్ సోకిన వారికి అందుతున్న చికిత్స, భవిష్యత్​లో అనుసరించాల్సిన వ్యూహం, తదితర అంశాలపై సీఎం కేసీఆర్ ​ఆదివారం ప్రగతి భవన్ లో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్​, మున్సిపల్ శాఖ మంత్రి కె.తారక రామారావు, ఆర్అండ్ బీ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, వైద్యశాఖ అధికారులు పాల్గొన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి, దాని నివారణకు తీసుకుంటున్న చర్యలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్​ సమావేశంలో పరిస్థితిని వివరించారు. ‘లాక్ డౌన్ విధించడం చాలా పెద్దనిర్ణయం అవుతుంది. ప్రభుత్వ యంత్రాంగాన్ని, ప్రజలను సన్నద్ధం చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా పోలీసు యంత్రాంగాన్ని సిద్ధం చేయాలి. కేబినెట్ ను సమావేశపరచాలి. అందరి అభిప్రాయాలు తీసుకుని లాక్ డౌన్ పై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. రెండు మూడు రోజుల పాటు పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలిస్తాం. అవసరమనుకుంటే మూడు నాలుగు రోజుల్లో కేబినెట్ ను సమావేశపరిచి, జీహెచ్ఎంసీ పరిధిలో మళ్లీ లాక్ డౌన్ విధించాలనే ప్రతిపాదనలతో పాటు అన్ని విషయాలు, ప్రత్యామ్నాయాలను చర్చించి నిర్ణయం తీసుకుంటాం’ అని సీఎం కేసీఆర్ చెప్పారు.
భయపడేదేమీ లేదు
ఎక్కువ పాజిటివ్ కేసులు వచ్చినంత మాత్రాన భయాందోళనకు గురి కావాల్సిన అవసరం ఏమీలేదని, అందరికీ సరైనవైద్యం అందించేందుకు ప్రభుత్వం అన్నిరకాల ఏర్పాట్లు చేసిందని సీఎం కేసీఆర్​ వెల్లడించారు. మరికొద్దిరోజుల పాటు తిరిగి లాక్ డౌన్ విధించాలనే ప్రతిపాదనలపై కూడా తుది నిర్ణయం తీసుకోనున్నట్లు చెప్పారు. ‘జాతీయ సగటులో పోలిస్తే తెలంగాణలో మరణాల సంఖ్య కూడా తక్కువే. పెద్దగా భయపడాల్సింది ఏమీ లేదు. పాజిటివ్ గా తేలిన వారికి అవసరమైన వైద్యసేవలు అందిస్తున్నాం. ప్రభుత్వాసుపత్రులతో పాటు ప్రైవేట్​మెడికల్ కాలేజీల్లో కూడా వేలాది బెడ్లు సిద్ధంచేశాం. సీరియస్ పేషెంట్లకు ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నాం. వ్యాధి లక్షణాలు లేని వారిని ఇంట్లోనే ఉంచి చికిత్స అందిస్తున్నాం’ అని మంత్రి ఈటల రాజేందర్​ వివరించారు. జీహెచ్ఎంసీ పరిధిలో వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు మరోసారి 15 రోజుల పాటు లాక్ డౌన్ విధించాలనేది వైద్యాధికారులు, వైద్య నిపుణులు కోరుతున్నారని చెప్పారు.
మరణాల రేటు తక్కువే
వైద్యారోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ప్రభుత్వానికి పంపిన తాజా నివేదికలో కూడా తెలంగాణలో వైరస్ వల్ల మృతిచెందిన వారి సంఖ్య చాలా తక్కువగా ఉందని వెల్లడించారు. కోవిడ్ వల్ల మరణించిన వారి జాతీయ సగటు 3.04 ఉండగా, తెలంగాణలో అది కేవలం 1.52 మాత్రమే అని ఆమె వెల్లడించారు. తెలంగాణలో పెద్దఎత్తున పరీక్షలు నిర్వహిస్తున్నామని, పాజిటివ్ గా తేలిన వారికి సరైన వైద్యం అందిస్తున్నామని చెప్పారు.