Breaking News

కావాలనే తప్పుడు ప్రచారం

  • అమిత్‌షా, కేంద్రంపై మమత ఫైర్‌‌

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ, కేంద్ర ప్రభుత్వం మధ్య పొలిటికల్‌ వార్‌‌ రోజు రోజుకు ముదురుతోంది. కేంద్ర మంత్రి అమిత్‌ షాపై దీదీ తీవ్రవిమర్శలు చేశారు. అమిత్‌షా, తన మధ్య జరిగిన సంభాషణలను దీదీ మీడియాతో చెప్పారు. వైరస్‌ను కంట్రోల్‌ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయిందని ఆరోపిస్తున్న హోం మంత్రి అమిత్‌ షా తానే స్వయంగా ఎందుకు రంగంలోకి దిగడం లేదో చెప్పాలని అన్నారు. ‘పదే పదే బెంగాల్‌కు సెంట్రల్‌ టీమ్‌ను పంపిస్తున్నారు మంచిదే. బెంగాల్‌ ప్రభుత్వం కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోలేక పోతోందని మీకు అనిపిస్తే మీరే డైరెక్ట్‌గా హ్యాండిల్‌ చేయండి’ అని అమిత్‌షాతో అన్నాను. ‘లేదు లేదు రాష్ట్ర ప్రభుత్వాన్ని మేం ఎలా డిస్‌లాడ్జ్‌ చేస్తాం’ అని షా చెప్పారు. నేను దానికి థ్యాంక్స్‌ చెప్పాను’ అని మమతబెనర్జీ మీడియాతో చెప్పారు. లాక్‌ డౌన్‌ విధించి రైళ్లు, విమానాలు నడపడం ఎందుకని మమత ఫైర్‌‌ అయ్యారు. ‘కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా చూడాలని ప్రధాని, హోం మంత్రిని కోరుతున్నాను. ఇప్పటికే లక్ష కేసులు దాటినయి. కొంత మంది వాటితో పాలిటిక్స్‌ చేయాలని చూస్తున్నారు.

బీహార్‌‌, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌లో కూడా వైరస్‌ వ్యాప్తి జరుగుతోంది. ఇలాంటి టైంలో నేను ఏమి చేస్తా? ఈ కష్టంకాలంలో పీఎం కలుగజేసుకుని ఆదుకోవాలి’ అని మమత అన్నారు. తనను ఇబ్బంది పెట్టేందుకే మహారాష్ట్ర నుంచి ఒకేసారి 36 రైళ్లలో వలస కూలీలను బెంగాల్‌కు తరలిస్తున్నారని ఆమె ఆరోపించారు. పొలిటికల్‌గా డిస్ట్రబ్‌ చేసేందుకు ఇలాంటి పనులు చేస్తున్నారని, కానీ అది బెంగాల్‌కు ఇబ్బంది కలిగిస్తోందని అన్నారు. అయితే మమత చేసిన ఆరోపణలను బీజేపీ తిప్పికొట్టింది. ఆమె కావాలనే ఆరోపణలు చేస్తున్నారని బెంగాల్‌ బీజేపీ చీఫ్‌ అన్నారు. బెంగాల్‌లో కరోనా వ్యాప్తిని అడ్డుకోవడంతో బెంగాల్‌ సర్కార్‌‌ ఫెయిల్ అయిందని, శ్రామిక్‌ రైళ్లను రానివ్వడం లేదని అమిత్‌ షా అన్నారు. ఈ నేపథ్యంలో మొదటి నుంచి వారిద్దరి మధ్య పొలిటికల్‌ వార్‌‌ నడుస్తూనే ఉంది.