Breaking News

ఎవరికీ లంచాలిచ్చే పనిపెట్టొద్దు

ప్రజలకు లంచాలిచ్చే పనిపెట్టొద్దు

  • అవినీతికి ఆస్కారం లేకుండా వ్యవసాయేతర ఆస్తులు, భూముల రిజిస్ట్రేషన్
  • బిల్డర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఇతర వర్గాల అభిప్రాయాలు తీసుకోండి
  • ఉన్నతస్థాయి సమావేశంలో సీఎం కె.చంద్రశేఖర్​రావు ఆదేశాలు

సారథి న్యూస్, హైదరాబాద్: ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా, ప్రజలకు లంచాలు ఇచ్చే పరిస్థితి రాకుండా, అత్యంత పారదర్శకంగా, సులభంగా ఉండేలా వ్యవసాయేతర ఆస్తులు, భూముల రిజిస్ట్రేషన్ జరగాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సూచించారు. ‘వ్యవసాయేతర ఆస్తులు.. వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేన్ కు అనుసరించాల్సిన పద్ధతులపై’ ఆదివారం ప్రగతి భవన్ లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లపై ఆరాతీశారు. చిన్న చిన్న సమస్యలు మినహా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ చాలా బాగుందని, రైతులు చాలా సులభంగా, సంతోషంగా రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారని ​సంతృప్తి వ్యక్తం చేశారు. వ్యవసాయేత భూముల విషయంలో కూడా అలాంటి విధానమే తీసుకురావాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. అన్ని సమస్యలు తొలగిపోయి సులభంగా, సౌకర్యవంతంగా రిజిస్ట్రేషన్ చేయించుకునే విధానం రావాలని, హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చాలా వైభవంగా సాగుతున్నదని వివరించారు. పేదలు సరైన డాక్యుమెంట్లు లేకుండానే ఇండ్లు నిర్మించుకున్నారు. వారికి కరెంట్​బిల్లు, ఇంటి పన్ను, నీటి బిల్లులు వస్తున్నాయి. అలాంటి ఆస్తులను అమ్మే, కొనే సందర్భంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. వాటిని పరిష్కరించడానికి కూడా మార్గం కనిపెట్టాలని సూచించారు.

మంత్రులు, ఉన్నతాధికారుల సమావేశంలో మాట్లాడుతున్న సీఎం కె.చంద్రశేఖర్​రావు

కమిటీ నియామకం
వ్యవసాయేతర ఆస్తులు, భూముల రిజిస్ట్రేషన్ కోసం అవలంభించాల్సిన పద్ధతులపై అన్ని వర్గాలతో మాట్లాడి, అవసరమైన సూచనలు ఇవ్వడం కోసం ఆర్ అండ్ బీ, గృహ నిర్మాణ శాఖల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘాన్ని సీఎం నియమించారు. ఈ కమిటీలో మున్సిపల్ శాఖ మంత్రి కె.తారక రామారావు, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ సభ్యులుగా ఉంటారు. మూడు నాలుగు రోజుల పాటు బిల్డర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఇతర వర్గాలతో సమావేశమై, వారి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని అనుసరించాల్సిన వ్యూహం ఖరారు చేయాలని మంత్రి వర్గ ఉపసంఘాన్ని సీఎం ఆదేశించారు. సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, సీఎంవో కార్యదర్శులు శేషాద్రి, స్మితాసబర్వాల్, రాజశేఖర్ రెడ్డి, భూపాల్ రెడ్డి, మీ సేవా కమిషనర్ జీటీ వెంకటేశ్వర్ రావు, ఎమ్మెల్యే బాల్క సుమన్, ఎమ్మెల్సీ నవీన్ రావు తదితరులు పాల్గొన్నారు.