Breaking News

ఆ ఊరులో గొర్రెలు, మేకలకు కరోనా?

ఆ ఊరులో గొర్రెలు, మేకలకు కరోనా?

కరోనా.. క్వారంటైన్ పేరు చెప్పగానే ఉలిక్కిపడే పరిస్థితి వచ్చింది. కరోనా లక్షణాలు కనిపించినా, ఎవరైనా దూర ప్రయాణాలు చేసి వచ్చినా.. అధికారులు 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంచుతున్నారు. ఓ ఊరులో గొర్రెలు, మేకల కోసం కూడా క్వారంటైన్ ఏర్పాటు చేయాల్సి వచ్చింది. క‌ర్ణాట‌కలోని తుమ‌కూరు జిల్లా చిక్కనాయకనహళ్లి తాలూకాలోని గొడెకెరె గ్రామ పంచాయతీ పరిధిలోని గొల్లరహట్టి గ్రామంలో ఓ వ్యక్తికి చెందిన కొన్ని గొర్రెలు, మేక‌లు కొన్ని రోజులుగా శ్వాస‌కోస స‌మ‌స్యలతో బాధపడుతున్నాయి. జలుబు, జ్వరం లక్షణాలతో బాధ పడుతున్న ఆ జంతువుల ముక్కులోంచి జిగట లాంటి పదార్థం కారడాన్ని గ్రామస్తులు గ‌మ‌నించారు. వాటికి కరోనా సోకిందేమోనని ఆందోళనకు గురవుతున్నారు. ఎందుకంటే.. ఆ గొర్రెల కాప‌రికి అప్పటికే క‌రోనా వైర‌స్ పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయింది. దీంతో గ్రామంలో అలజడి రేగింది. గొర్రెల కాప‌రికి క‌రోనా సోకినట్లు నిర్ధారణ కావ‌డంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. రంగంలోకి దిగిన అధికారులు ముందు జాగ్రత్త చర్యగా సుమారు 50 గొర్రెలు, మేక‌ల‌ను క్వారంటైన్‌లో ఉంచారు. పీపీఈ కిట్లు ధరించి ఆ మేకల నుంచి నమూనాలు సేకరించి పరీక్షలకు పంపించారు. అయితే.. మేకలకు క‌రోనా వైర‌స్ సోకే ప్రమాదం లేద‌ని అధికారులు చెబుతున్నారు. ఒకవేళ మేకలకు వైరస్ సోకినా.. వాటి నుంచి మనుషులకు సోకుతుందనడానికి ఆధారాలు లేవని తెలిపారు.
అమెరికాలో జంతువులకు కరోనా
అమెరికాలోని న్యూయార్క్‌లో పులులు, సింహాలు, పెంపుడు పిల్లులు, కుక్కలకు కరోనా వైరస్ సోకిన నేపథ్యంలో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశాన్ని క‌ర్ణాట‌క న్యాయ శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఘటనపై సమగ్ర ద‌ర్యాప్తు జ‌ర‌పాల‌ని ప‌శుసంవర్ధక శాఖ‌ అధికారులను ఆయన ఆదేశించారు. మేకల్లో సోకే ప్లేగు లేదా మైకో ప్లాస్మాగా పిలిచే ‘పెస్టెడెస్ పెటిట్స్ రూమినాంట్స్‌ (పీపీఆర్‌)’ వ్యాధితో ఆ మేకలు బాధ‌ పడుతున్నట్లు వెటర్నరీ వైద్యులు అనుమానిస్తున్నారు. పీపీఆర్‌, మైకో ప్లాస్మా కూడా గాలి ద్వారా సంక్రమించే వ్యాధులు కావ‌డంతో మిగ‌తా గొర్రెలకు సోక‌కుండా ముందు జాగ్రత్త చర్యగా వ్యాధి సోకిన మేకలను నిర్బంధంలో ఉంచినట్లు అధికారులు వివరించారు. మేకల నుంచి సేకరించిన న‌మూనాల‌ను ఫరీక్షల కోసం బోపాల్‌లోని వెట‌ర్నరీ ల్యాబ్‌కు పంపించారు. ఫలితాలు రావాల్సి ఉంది.