Breaking News

కార్మికుల ఆత్మస్థైర్యం దెబ్బతీయొద్దు

కార్మికుల ఆత్మస్థైర్యం దెబ్బతీయొద్దు

సారథి న్యూస్, నాగర్​కర్నూల్: గ్రామ పంచాయతీ, మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్​చేస్తూ తెలంగాణ గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్, తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ యూనియన్​ఆధ్వర్యంలో శుక్రవారం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని గాంధీపార్కులో ధర్నా నిర్వహించారు. అనంతరం ర్యాలీగా వెళ్లి కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు మాట్లాడుతూ.. పంచాయతీ, మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం రూ.24వేలు ఇవ్వాలని డిమాండ్​చేశారు. పోరాడి సాధించుకున్న రూ.8,5‌‌‌‌00 జీతాన్ని ఇప్పటికీ పంచాయతీ కార్మికులకు ఇవ్వడం లేదన్నారు. జీవోనం.20,26 తీసుకొచ్చి ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లను కడగాలనే నిబంధన పెట్టడం సరికాదన్నారు. వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడంలో భాగంగా మల్టీపర్పస్​ విధానాన్ని తీసుకొచ్చారని అన్నారు. జీవోనం.51ను సవరించాలని, పంచాయతీ కార్మికులకు రూ.19వేల వేతనం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్​చేశారు. ఈఎస్ఐ, పీఎఫ్ ను పకడ్బందీగా అమలుచేయాలని, ప్రతినెలా 5వ తేదీలోపు వేతనాలు చెల్లించాలని కోరారు. కార్యక్రమంలో గ్రామపంచాయతీ యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వెంకటేష్, మహేష్, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు వెంకట్రాములు, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు పొదిల రామయ్య, కేవీపీఎస్​జిల్లా కార్యదర్శి లక్ష్మణ్, ఉపాధ్యక్షుడు అంతటి కాశన్న, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కొంపల్లి అశోక్ తిరుపతయ్య, వెంకటస్వామి, బాలస్వామి, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.