Breaking News

రేవంత్ ను చూస్తే భయమెందుకు

రేవంత్ ను చూస్తే భయమెందుకు
  •  కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మల్లు రవి

సామాజిక సారథి, హైదరాబాద్:  టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ను చూస్తే ఎందుకు భయపడుతున్నారని అధికార పార్టీ నేతలపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మల్లు రవి మండిపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌.. పోలీసులను సొంత ఆర్మీలా వాడుకుంటున్నారని ఆరోపించారు.పోలీసుల ద్వారా ప్రజల వద్దకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి కారణం లేకుండా రేవంత్‌ రెడ్డిని గృహనిర్బంధం చేశారని ధ్వజమెత్తారు. ప్రజాక్షేత్రంలోకి వెళ్లకుండా ఆంక్షలు పెడుతున్నారని విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీని నిషేధించారా? ఒకవేళ నిషేధిస్తే ఆ దిశగా ఆదేశాలు జారీ చేయాలని, అంతేగానీ.. పదేపదే అరెస్టులతో హింసించొద్దని అన్నారు.  ఉద్యోగ బదిలీలతో మనస్తాపానికి గురై గుండెపోటుతో మరణించిన ఓ ఉద్యోగి ఇంటికి పరామర్శించడానికి వెళ్లాలనుకున్న రేవంత్‌ రెడ్డిని అర్ధరాత్రి ఇంట్లోకి చొచ్చుకుపోయి గృహనిర్బంధం చేశారని ఆరోపించారు. ప్రభుత్వం నిర్బంధాలను నిరసిస్తూ టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులను ప్రజాక్షేత్రంలో తిరగనీయకుండా.. అడ్డుకోవాలని కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయించిందని మల్లు రవి తెలిపారు. కారణాలు లేకుండా కాంగ్రెస్‌ నాయకుల్ని పదేపదే అడ్డుకుంటూ నిర్బంధిస్తున్న టీఆర్ఎస్ సర్కార్‌పై కాంగ్రెస్‌ తిరగబడుతుందని చెప్పారు. ఈ విధంగా రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందామని హస్తం శ్రేణులకు పిలుపునిచ్చారు.