Breaking News

అరకు లోయలో టూరిస్టు బస్సు బోల్తా

అరకు లోయలో టూరిస్టు బస్సు బోల్తా

  • ఘాట్​రోడ్డులో ఘోరప్రమాదం
  • నలుగురు దుర్మరణం
  • 19 మందికి గాయాలు
  • బాధితులు హైదరాబాద్ ​వాసులు

విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. శుక్రవారం రాత్రి అరకు ఘాట్‌రోడ్డులో అనంతగిరి మండలం డముకు వద్ద పర్యాటకులతో వెళ్తున్న టూరిస్టు బస్సు ఐదో నంబర్‌ మలుపు వద్ద బోల్తాపడింది. ప్రమాద సమయంలో బస్సులో 23 మంది పర్యాటకులు ఉండగా.. వారిలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. 19 మందికి గాయాలైనట్లు అనంతగిరి ఎస్సై తెలిపారు. పోలీసులు, 108 సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు. ఐదుగురు చిన్నారులు సహా 12 మందిని ఎస్‌.కోట ఆస్పత్రికి తరలించారు. మరికొంత మంది క్షతగాత్రులను అనంతగిరి, కేజీహెచ్‌ ఆస్పత్రులకు తీసుకెళ్లారు. ప్రమాదానికి గురైన బస్సును హైదరాబాద్‌లోని షేక్‌పేటకు చెందిన దినేశ్‌ ట్రావెల్స్‌కు చెందినదిగా గుర్తించారు. మృతులంతా హైదరాబాద్‌కు చెందిన వారిగా భావిస్తున్నారు. పూర్తిగా చీకటి పడడంతో సహాయక చర్యలకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. బాధితులంతా ఇవాళ ఉదయం హైదరాబాద్‌ నుంచి అరకు వచ్చి.. అరకు నుంచి తిరిగి వెళ్తుండగా లోయలోకి బస్సు దూసుకెళ్లినట్లు తెలుస్తోంది.  ఈ ఘటనపై మంత్రి అవంతి శ్రీనివాస్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్‌ విజయ్‌చంద్‌కు ఫోన్‌ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.

ప్రధాని మోడీ తీవ్ర దిగ్భ్రాంతి
అరకు బస్సు ప్రమాద దుర్ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అలాగే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​ముఖ్యమంత్రులు కె.చంద్రశేఖర్​రావు, వైఎస్​జగన్​మోహన్​రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి చెందారు. ఈ ఘటన పట్ల విచారం వ్యక్తంచేశారు.