Breaking News

రైతును రాజుగా చేయడమే లక్ష్యం

రైతును రాజుగా చేయడమే లక్ష్యం


సారథి న్యూస్, మెదక్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతును రాజుగా చేయడమే లక్ష్యంగా పనిచేస్తోందని, అందుకు సీఎం కేసీఆర్ ​కృతనిశ్చయంతో ఉన్నారని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి టి.హరీశ్​రావు అన్నారు. రాష్ట్ర బడ్జెట్​లో రైతుల సంక్షేమం కోసం మూడోవంతు నిధులు కేటాయిస్తూ వారి ఉన్నతికి కృషి చేస్తున్నామని తెలిపారు. గురువారం మెదక్ ​మండలం పాతూరులో రైతువేదిక ప్రారంభోత్సవం, మెదక్ ​పట్టణంలో సఖి కేంద్రం నిర్మాణానికి శంకుస్థాపన, డీసీసీబీ కార్యాలయం, పట్టణంలో రైతువేదికను ప్రారంభించారు. అంతకుముందు ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్​ నుంచి పట్టణంలోని రైల్వేస్టేషన్ ​సమీపంలో ఉన్న రైతువేదిక వరకు ట్రాక్టర్ ​నడుపుతూ వచ్చారు. అనంతరం ఇక్కడ జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. మెదక్ ​జిల్లాకు ప్రధాన నీటి వనరులైన ఘనపురం ఆనకట్ట పెంపునకు గతంలో రూ.వందకోట్లు కేటాయించామన్నారు. రేపోమాపో సింగూరుకు కాళేశ్వరం నీళ్లు అందుతాయని అన్నారు. రైతులకు రూ.6వేల మద్దతు ధర చెల్లించి ప్రభుత్వమే కందులను కొనుగోలు చేస్తుందన్నారు. అప్పట్లో సింగూరు ప్రాజెక్టు నుంచి ఘనపురం ఆనకట్టకు నీళ్లందాలంటే మంత్రలు కరణం రాంచందర్​రావు, సుదర్శన్​రెడ్డి వంటి వారి ఇళ్లకు తెల్లారుజామున నాలుగు గంటలకే జీపులు, కార్లలో వెళ్లే పరిస్థితులు ఉండేవని, ప్రస్తుతం మెదక్ ఎమ్మెల్యేకు ఫోన్​చేస్తే సమస్య పరిష్కారమవుతుందన్నారు. జిల్లా కేంద్రమైన మెదక్​పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దుతామన్నారు. అక్కన్నపేట – మెదక్​ నుంచి రైల్వేలైన్​ పనులకు రూ.20 కోట్లు మంజూరయ్యాయని, త్వరలోనే రైలుకూత వినిపిస్తోందన్నారు. అలాగే ఇండస్ట్రీయల్​ ఎస్టేట్ ను ​ఏర్పాటుచేసి ఉద్యోగావకాశాలు పెంపొందిస్తామని పేర్కొన్నారు.
అప్పట్లో పిల్లనిచ్చేది కాదు
మెదక్​ ఎమ్మెల్యే పద్మాదేవేందర్​రెడ్డి మాట్లాడుతూ.. గతంలో రైతులకు పిల్లనియ్యడమే కష్టమయ్యేదని, ప్రస్తుతం వ్యవసాయం చేసే రైతులకు పిల్లనిచ్చేందుకు ముందుకొస్తున్నారని అన్నారు. మెదక్​నియోజకవర్గంలో 26 రైతువేదికలు పూర్తయ్యాయని వెల్లడించారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్​చిట్టి దేవేందర్​రెడ్డి, ఇఫ్కో డైరెక్టర్​దేవేందర్​రెడ్డి, జడ్పీ వైస్​చైర్​పర్సన్​లావణ్యరెడ్డి, జిల్లా రైతుబంధు అధ్యక్షుడు తాడెపు సోములు, డీఏవో పరశురామ్​నాయక్, డీడబ్ల్యువో రసూల్​బీ, ఎంపీపీ యమున, మున్సిపల్​చైర్మన్​చంద్రపాల్, పీఏసీఎస్​ చైర్మన్​హన్మంతరెడ్డి, కౌన్సిలర్లు ఆర్ .శ్రీనివాస్​, సమీయొద్దీన్​, నాయకులు బట్టి జగపతి, లింగారెడ్డి, అశోక్​, మెదక్​ ఆర్డీవో సాయిరామ్​, మున్సిపల్​ కమిషనర్​ శ్రీహరి, వ్యవసాయాధికారులు రెబల్​సన్​, నాగమాధురి, పంచాయతీరాజ్​, మున్సిపల్​ శాఖల అధికారులు, నాయకులు పాల్గొన్నారు.