![రైతుల ర్యాలీలో ఉద్రిక్తత](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2021/01/rally26.jpg?fit=583%2C384&ssl=1)
న్యూఢిల్లీ: కొత్త సాగు చట్టాలను వ్యతిరేకిస్తున్న రైతులు తమ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేశారు. ఢిల్లీలో ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించిన రైతులు ఎర్రకోటపై తమ జెండాను ఎగరవేశారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ నగరంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన రైతులు నగరం నలువైపులా ర్యాలీ తీశారు. ట్రాక్టర్ ఢీకొనడంతో ఓ రైతు చనిపోయాడు. అయితే అంతకుముందు ట్రాక్టర్ల ద్వారా దేశరాజధానికి చేరుకుంటున్న రైతులను పోలీసులు ఎక్కడికక్కడే అడ్డుకున్నారు. ఢిల్లీలో అల్లర్లు చెలరేగే అవకాశం ఉందని నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రధాన రహదారులను మూసివేశారు. పార్లమెంట్, విజయ్చౌక్, రాజ్పథ్, ఇండియాగేట్ వైపు వెళ్లే దారులను డైవర్ట్ చేశారు. అయితే అక్కడక్కడ ఏర్పాటుచేసిన బారీకేడ్లు, దిమ్మెలను అడ్డు తొలగించుకుని రైతులు వచ్చారు. దీంతో సింఘు, టిక్రీ సరిహద్దుల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది.