Breaking News

వేగమే మృత్యువైంది!

వేగమే మృత్యువైంది!

  • రోడ్డు ప్రమాదంలో ఇద్దరి దుర్మరణం
  • మృతులు తండ్రీకొడుకులు
  • బిజినేపల్లి మండల కేంద్రంలో దుర్ఘటన
  • పరామర్శించిన ఎమ్మెల్యే మర్రి జనార్ధన్​రెడ్డి

సారథి, బిజినేపల్లి: అతివేగం ఇద్దరి నిండుప్రాణాలను బలితీసుకుంది. రెండు బైక్​లు ఎదురెదురుగా ఢీకొనడంతో తండ్రీకొడుకులు చనిపోయారు. ఈ దుర్ఘటన శుక్రవారం నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ సమీపంలో జరిగింది. బిజినేపల్లి మండలం వట్టెం గ్రామానికి చెందిన శివకుమార్ గౌడ్(35), బాలయ్య గౌడ్(65) వట్టెం నుంచి వనపర్తికి వెళ్తున్నారు. అలాగే కోడేర్​కు చెందిన రాఘవేందర్(35), వినోద్(21) గోపాల్​పేటకు వచ్చి తిరిగి వెళ్తున్నారు. బిజినేపల్లిలో రెండు బైక్​లు ఢీకొనడంతో తండ్రీకొడుకులు శివకుమార్ గౌడ్, బాలయ్యగౌడ్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. వారి తలలు పగిలిపోవడంతో ఆ ప్రాంతమంతా హృదయవిదారకంగా మారింది. రోడ్డంతా నెత్తుటితో తడిచింది. తీవ్రంగా గాయపడిన రాఘవేందర్, వినోద్​ను నాగర్​కర్నూల్​జిల్లా ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో హైదరాబాద్​కు తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న నాగర్​కర్నూల్​ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్​రెడ్డి జిల్లా ఆస్పత్రిలోని మార్చురీలో మృతదేహాలను పరిశీలించారు. బాధిత కుటుంబసభ్యులను పరామర్శించారు. తక్షణ సహాయం కింద రూ.20వేలు అందజేశారు. ఆయన వెంట పలువురు ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్​పార్టీ నాయకులు ఉన్నారు.

ఆ ఇంటికి దిక్కెవరు?
వట్టెం గ్రామానికి చెందిన బాలయ్యగౌడ్ కు ఇద్దరు కొడుకులు, కూతురు. పెద్దకొడుకు అశోక్​ అనారోగ్యంతో నెలరోజుల క్రితం చనిపోయాడు. శివకుమార్​గౌడ్​రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. అతని భార్య ప్రస్తుతం ఏడునెలల గర్భిణి. ఆ కుటుంబంలో ప్రస్తుతం బాలయ్య భార్య, అతని కూతురు మాత్రమే మిగిలారు. ఆ కుటుంబ పరిస్థితిని తలుచుకొని బంధువులు, గ్రామస్తులు కన్నీరుమున్నీరవుతున్నారు.