సారథి న్యూస్, హైదరాబాద్: నిరుద్యోగులకు భృతి ఇవ్వాలని, ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని, వాస్తవ ప్రభుత్వ ఉద్యోగ నియామకాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో సోమవారం నాంపల్లిలోని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆఫీసును ముట్టడించారు. ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డి మాట్లాడుతూ.. నిరుద్యోగ భృతి ఇస్తామని జనవరి 28న మంత్రి కేటీఆర్ప్రకటించి విధివిధానాలను విడుదల చేయలేదని, 1.32లక్షల ఉద్యోగాలను భర్తీచేశామని అబద్ధపు మాటలు చెబుతూ యువతను మోసగిస్తున్నారని మండిపడ్డారు. ఉద్యోగాల కల్పన లెక్కలపై అమరవీరుల స్థూపం వద్దకు బహిరంగ చర్చకు రావాలని సవాల్ చేస్తే రాకుండా తోకముడిచారని ఎద్దేవాచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఐటీఐఆర్ ప్రాజెక్టును ఆరేళ్లుగా కుట్రపూరితంగా పక్కకు పెట్టారని విమర్శించారు.
గాంధీభవన్ నుంచి పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు వెళ్తున్న యూత్ కాంగ్రెస్నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్చేసి నారాయణగూడ పోలీస్స్టేషన్కు తరలించారు. కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డితో పాటు హైదరాబాద్ జిల్లా యువజన కాంగెస్ అధ్యక్షుడు మోత రోహిత్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ప్రభాకర్, అరవింద్ యాదవ్, రాకేష్, విద్యారెడ్డి, శివలాల్ రాథోడ్, రంగారెడ్డి జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు రవికాంత్ గౌడ్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా యువజన కాంగెస్ అధ్యక్షుడు శ్రావణ్ రెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం యువజన కాంగెస్ అధ్యక్షుడు వెంకట్ గురిజాల, వికారాబాద్ జిల్లా యూత్కాంగ్రెస్ అధ్యక్షుడు సతీష్ రెడ్డి పాల్గొన్నారు.