Breaking News

ఆర్ఎస్ఎస్​వాదులు కాంగ్రెస్ నుంచి వెళ్లిపోండి

ఆర్ఎస్ఎస్​వాదులు కాంగ్రెస్ నుంచి వెళ్లిపోండి

న్యూఢిల్లీ: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్)​భావజాలం కలిగిన నేతలు ఎవరైనా కాంగ్రెస్ లో ఉంటే, అలాంటి నేతలు వెంటనే పార్టీ నుంచి వెళ్లిపోవాలని కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సూచించారు. శుక్రవారం జూమ్ ద్వారా నిర్వహించిన సోషల్ మీడియా విభాగం కార్యక్రమంలో రాహుల్ గాంధీ పాల్గొని కీలక ప్రసంగం చేశారు. సంఘ్ భావజాలం ఉన్న కాంగ్రెస్ నేతలకు తలుపులు తెరిచే ఉన్నాయని, ఏమాత్రం ఆలోచించకుండా పార్టీ నుంచి బయటికి వెళ్లిపోవచ్చన్నారు. ‘ఇక్కడ చాలా మంది ధైర్యవంతులు ఉన్నారు. అందులో ఎక్కువ మంది కాంగ్రెస్ పార్టీ బయట ఉన్నారు. అలాంటి వారిని గుర్తించి వెంటనే పార్టీలోకి తీసుకురావాలి. అంతే కాకుండా కాంగ్రెస్ పార్టీలో కూడా భారతీయ జనతాపార్టీకి భయపడేవారు చాలా మందే ఉన్నారు. అలాంటి వారికి తలుపులు తెరిచే ఉంటాయి. అలాంటి వారు ఏమాత్రం ఆలస్యం చేయకుండా బయటికి వెళ్లాలి. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ భావజాలం ఉన్న నేతలు మాకు అవసరం లేదు. అలాంటి వారు కూడా పార్టీ నుంచి వెళ్లిపోవడమే మంచిది. మాకు ధైర్యవంతులు కావాలి’ అని రాహుల్ గాంధీ హితవుపలికారు.