Breaking News

‘రొమాంటిక్‌’ థియేటర్లలోనే..

‘రొమాంటిక్‌’ థియేటర్లలోనే..

‘మెహబూబా’ సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్. సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోయినా హీరోగా మాత్రం మంచి గుర్తింపే వచ్చింది ఆకాష్​ కు. ఇప్పుడు ‘రొమాంటిక్’ సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నాడు. ఈ చిత్రంలో ఆకాష్ సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ కేతికా శర్మ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్​ టైనర్​ కు పూరీ స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించారు. పూరీ శిష్యుడు అనిల్ పాదూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఎప్పుడో పూర్తయిన ఈ సినిమాను జూన్ 18న విడుదల చేయాలని అనుకున్నారు. అయితే కరోనా సెకండ్ వేవ్ ప్రభావం వల్ల వాయిదావేశారు. తాజాగా ఈ సినిమా విడుదల గురించి మేకర్స్ క్లారిటీ ఇస్తూ చిత్రాన్ని థియేటర్లలోనే రిలీజ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అంతేకాదు ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయినట్లు వెల్లడించారు. సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి ‘యూ/ఏ’ సర్టిఫికేట్ జారీ చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా హీరోహీరోయిన్ల ఇంటెన్స్ రొమాంటిక్ పోస్టర్‌‌ను చిత్రయూనిట్ విడుదల చేసింది. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్​ ను ప్రకటించనున్నారు. ఈ చిత్రంలో సీనియర్ నటి రమ్యకృష్ణ కీలకపాత్ర పోషించారు. మకరంద్ దేశ్ పాండే, ఉత్తేజ్, సునయన ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. సునీల్ కశ్యప్ సంగీతం, నరేష్ సినిమాటోగ్రఫీ అందించారు. లావణ్య సమర్పణలో పూరీ జగన్నాథ్ టూరింగ్ టాకీస్ మరియు పూరీ కనెక్ట్స్ బ్యానర్స్ పై పూరీ జగన్నాథ్, చార్మీ కౌర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.