Breaking News

మెడికోలపై వేటు

మెడికోలపై వేటు
  • సూర్యాపేట ర్యాగింగ్‌ ఘటనపై సర్కారు సీరియస్‌
  • ఆరుగురు వైద్యవిద్యార్థులపై కేసు నమోదు

సామాజికసారథి, సూర్యాపేట: సూర్యాపేట మెడికల్‌ కాలేజీలో జరిగిన ర్యాగింగ్‌ ఘటనపై ప్రభుత్వం తక్షణ చర్యలకు దిగింది. ర్యాగింగ్‌ బాధ్యులను గుర్తించిన అధికారులు ఆరుగురు మెడికోలను  సస్పెండ్‌ చేశారు. ఏడాది పాటు కాలేజీ నుంచి సస్పెండ్‌ చేయడంతో పాటు కాలేజీ హాస్టల్‌ నుంచి శాశ్వతంగా తొలగిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. కాలేజీలో ర్యాగింగ్‌ ఘటన వెలుగులోకి వచ్చిన వెంటనే వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీష్‌ రావు విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. డీఎంఈ రమేష్‌ రెడ్డి ఆధ్వర్యంలో విచారణ కమిటీ వెంటనే రంగంలోకి దిగిన కమిటీ కాలేజీ, హాస్టల్‌ ను సందర్శించి విచారించింది. బాధిత విద్యార్థి ఫిర్యాదుతో జిల్లా ఎస్పీ రాజేందప్రసాద్‌ ఐదుగురు విద్యార్థులపై ఐపీసీ సెక్షన్‌ 342, 323, 352, 504, 506, తెలంగాణ ప్రొహిబిషన్‌ ర్యాగింగ్‌ యాక్ట్‌ కింద కేసులు నమోదు చేశారు. పోలీసు కేసు గురించి కూడా విచారించిన కమిటీ.. మొత్తం ఆరుగురు మెడికోలను బాధ్యులుగా గుర్తించింది. వారిని కాలేజీ నుంచి ఏడాదిపాటు సస్పెండ్‌ చేయాలని, అలాగే హాస్టల్‌ నుంచి శాశ్వతంగా తొలగించాలని సిఫారసు చేసింది. కమిటీ సిఫారసుపై స్పందించిన సూర్యాపేట మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపల్‌ ఆరుగురు విద్యార్థులపై చర్య తీసుకున్నారు.