Breaking News

8 నుంచి హాలీడేస్​

8 నుంచి హాలీడేస్
  • 16వరకు విద్యాసంస్థలకు సెలవులు
  • కరోనా, ఒమిక్రాన్‌ వ్యాప్తి
  • సీఎం కేసీఆర్‌ కీలక నిర్ణయం

సామాజికసారథి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా వ్యాప్తి, ఒమిక్రాన్‌ కేసుల పెరుగుదల నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు సెలవులు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఈ నెల 8 నుంచి 16వ తేదీ వరకు హాలీ డేస్​ఇవ్వాలని సూచించారు. కరోనా వ్యాప్తి, ఒమిక్రాన్‌ కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో వైద్యాగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు సహా పలువురు ఉన్నతాధికారులతో సీఎం సమీక్షించారు. ప్రస్తుతం లాక్‌డౌన్‌ అక్కర్లేదని అధికారులు నివేదిక ఇచ్చినట్లు సీఎం తెలిపారు. కరోనా దృష్ట్యా ప్రభుత్వాస్పత్రుల్లో మౌలిక వసతులు పటిష్టం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఆస్పత్రుల్లో పడకలు, పరీక్ష కిట్లు, మందులు సమకూర్చుకోవాలని వైద్యారోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. మిగతా పట్టణాల్లో బస్తీ దవాఖానాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ప్రతిఒక్కరూ కచ్చితంగా కొవిడ్‌ నిబంధనలు పాటించాలని, మాస్కు తప్పనిసరిగా ధరించాలని సీఎం సూచించారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా గుంపులుగా ఉండకూడదని, బహిరంగ సభలు, ర్యాలీలు లేకుండా చూడాలని సీఎం ఆదేశించారు.