Breaking News

హస్తం గూటికి డీఎస్​

హస్తం గూటికి డీఎస్
  • కాంగ్రెస్​లోకి సీనియర్​ నేత
  • జనవరి 24న ముహూర్తం
  • సోనియగాంధీ సమక్షంలో చేరిక

సామాజికసారథి, హైదరాబాద్: టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ డి.శ్రీనివాస్ తిరిగి సొంత గూటికి చేరనున్నారు. త్వరలోనే ఆయన కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోనున్నారు. అందుకు ముహూర్తం కూడా ఖరారైంది. టీఆర్ఎస్ పార్టీకి కొంతకాలంగా దూరంగా ఉంటూ వస్తున్న ఆయన కాంగ్రెస్​లో చేరుతారని జోరుగా ప్రచారం జరిగింది. అంతేగాకుండా ఆయన ఢిల్లీకి వెళ్లి హస్తం పార్టీ పెద్దలతో సమాలోచనలు కూడా జరిపినట్లు ప్రచారం జరిగింది. కానీ ఆయన చేరిక ఎప్పుడనేది ఫిక్స్ కాలేదు. కానీ తాజాగా జనవరి 24న కాంగ్రెస్​అధినేత్రి సోనియాగాంధీ సమక్షంలో డి.శ్రీనివాస్ పార్టీ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది. డి.శ్రీనివాస్​ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మంత్రిగా, పీసీసీ చీఫ్‌గా పని చేశారు. 2004లో పీసీసీ చీఫ్ గా ఉన్న సమయంలోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అప్పటి సీఎల్పీ నేత డాక్టర్​వైఎస్​రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇదిలాఉండగా, మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​రాష్ట్ర విభజన అనంతరం 2014లో తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక డి.శ్రీనివాస్ టీఆర్ఎస్ లో చేరారు. కాంగ్రెస్ లో తనకు ప్రాధాన్యత ఇవ్వకుండా అవమానించారని డీఎస్ గతంలో ఆరోపించారు. అదే సమయంలో టీఆర్ఎస్ నుంచి ఆహ్వానం రావడంతో ఆయన గులాబీ గూటికి చేరారు. అయితే, నిజామాబాద్ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ నేతలు డీఎస్ పై పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని సీఎం కేసీఆర్ కు కంప్లయిట్​చేశారు. ఈ విషయమై కేసీఆర్ ను కలిసే ప్రయత్నం చేసినా డీఎస్ కు అపాయింట్‌మెంట్ లభ్యం కాలేదనే టాక్ ఉంది.

  • టీఆర్ఎస్​దూరంగా డీఎస్​

అప్పటి నుంచి ఆయన టీఆర్ఎస్ కు దూరంగా ఉంటున్నారు. ఎంపీ పదవికి మాత్రం రాజీనామా చేయలేదు. డీఎస్ కాంగ్రెస్ లో చేరతారని కొంతకాలం నుంచి ప్రచారం జరుగుతోంది. బీజేపీలోకి వెళ్తారనే ప్రచారం నడిచింది. కాగా, డీఎస్ తనయుడు అరవింద్ గత ఎన్నికల్లో బీజేపీ తరఫున నిజామాబాద్ ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. ఆయన విజయం వెనుక.. డీఎస్ కీలకంగా వ్యవహరించారనే టాక్ వినిపించింది. ఆయన తిరిగి కాంగ్రెస్ లోకి వస్తుండటం పట్ల కొంతమంది సీనియర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఆయన చేరితే..కొడుకును కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిపించాలని ఇటీవలే సీనియర్ నేత వీహెచ్ కామెంట్ చేశారు. డీఎస్ చేరిక తర్వాత కాంగ్రెస్ లో మరోసారి విబేధాలు వెలుగుచూస్తాయా? లేదా? అన్నది వేచిచూడాలి.