Breaking News

దేశానికి మార్గదర్శి

దేశానికి మార్గదర్శి
  • తెలంగాణ బీసీ కమిషన్‌ పై కర్ణాటక ప్రశంసలు
  • త్వరలోనే దక్షిణాది రాష్ట్రాల కమిషన్ల సమావేశం
  • చైర్మన్‌ డాక్టర్‌ వకుళాభరణం కృష్ణమోహన్‌ రావు వెల్లడి

సామాజికసారథి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో అమలులో ఉన్న సంక్షేమ పథకాలు, బీసీ కమిషన్‌ పనితీరును కర్ణాటక బీసీ కమిషన్‌ చైర్మన్‌ జయప్రకాష్‌ ప్రశంసించారు. దేశానికి తెలంగాణ బీసీ కమిషన్​మార్గదర్శిగా నిలిచిందని, నియామకమైన మూడు నెలల్లోనే అనుసరిస్తున్న చట్టపరమైన విధివిధానాల పట్ల ఆయన అభినందనలు తెలిపారు. గురువారం హైదరాబాద్‌లో తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్‌ కార్యాలయంలో చైర్మన్‌ డాక్టర్‌ వకుళాభరణం కృష్ణమోహన్‌ రావు, సభ్యులు సీహెచ్‌ ఉపేంద్ర, శుభప్రద్‌ పటేల్‌ నూలి, కె.కిషోర్‌ గౌడ్‌, సెక్రటరీ బుర్రా వెంకటేశంను కర్ణాటక బీసీ కమిషన్‌ చైర్మన్‌ జయప్రకాష్‌ హెగ్డే, సభ్యులు రాజశేఖర్‌, ఎస్‌హెచ్‌.కళ్యాణ్‌ కుమార్‌, సువర్ణ కేటీ, అరుణ్‌ కుమార్‌ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ బీసీ కమిషన్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ వకుళాభరణం కృష్ణ మోహన్‌ రావు మాట్లాడుతూ.. త్వరలోనే దక్షిణాది రాష్ట్రాల బీసీ కమిషన్ల సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తమకు అందజేసిన టీఓఆర్‌ (టర్స్మ్‌ ఆఫ్‌ రిఫరెన్స్‌) ఆధారంగా నిర్దిష్టమైన అధ్యయనం మొదలు పెట్టినట్లు తెలిపారు. ఈ ప్రక్రియను ఆరంభించి నివేదిక సమగ్రంగా ప్రభుత్వానికి అందజేస్తామన్నారు. బీసీలకు బాసటగా తెలంగాణ దేశానికి మార్గదర్శకంగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు. సభ్యుడు సీహెచ్‌ ఉపేంద్ర మాట్లాడుతూ జాతీయస్థాయిలో ఎంబీసీ కమిషన్‌ ఏర్పాటు చేయాలని కోరారు. మరో సభ్యుడు శుభ ప్రద పటేల్‌ మాట్లాడుతూ దేశంలోనే దక్షిణాది రాష్టాల్రలో తొలిసారిగా కుల గణన చేపట్టాలని అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రాన్ని కోరిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదే అని అన్నారు. సభ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం  మాట్లాడుతూ వేలాది కోట్లు వెచ్చించి దేశంలోని అనేక పథకాలతో తెలంగాణ అగ్రభాగాన ఉందని పేర్కొన్నారు. అక్కడి సభ్యులు రాజశేఖర్‌, ఎస్‌.హెచ్‌.కళ్యాణ్‌ కుమార్‌, అరుణ్‌ కుమార్‌, సువర్ణ కర్ణాటక మిషన్‌ చట్టం, అక్కడి సంక్షేమ పథకాల అమలు తీరును వివరించారు. శుక్రవారం తెలంగాణ, కర్ణాటక రాష్ట్ర కమిషన్‌ చైర్మన్లు, సభ్యులు వర్గల్‌లోని మహాత్మజ్యోతిరావు పూలే డిగ్రీ కాలేజీని సందర్శించనున్నారు.