Breaking News

అన్నదాతను ప్రభుత్వం ఆదుకోవాలి: సీపీఐ

అన్నదాతను ప్రభుత్వం ఆదుకోవాలి: సీపీఐ

సారథి, చొప్పదండి: కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం రుక్మపూర్, కొనేరుపల్లి గ్రామాల్లో కురిసిన అకాలవర్షాలకు పంటనష్టపోయిన రైతులను ఆదుకోవాలని సీపీఐ జిల్లా కార్యదర్శి కొయ్యడ సృజన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం ఆయన పలు గ్రామాల్లో నష్టపోయి ధాన్యాన్ని పరిశీలించారు. వడ్లను సకాలంలో కొనుగోలు చేయడంలో మిల్లర్లు కొర్రీలు పెట్టడం ద్వారా కల్లంలోనే తడిసి ముద్దయ్యాయని, తద్వారా రైతులకు తీవ్రనష్టం కలిగిందని ఆవేదన వ్యక్తంచేశారు. ప్యాడీ క్లీనర్లు, టార్పలిన్ కవర్లు లేకపోవడం, తాలు పేరుతో సకాలంలో కొనకపోవడంతో వారాల పాటు ధాన్యాన్ని కల్లంలోనే ఉంచాల్సి వచ్చిందని, అకాలవర్షాలకు పూర్తిగా తడిసిపోయిందన్నారు. పంట చేతకొచ్చిన తరుణంలో ప్రకృతి వైపరీత్యాల కారణంగా రైతులకు కన్నీరే మిగిలిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే తడిసిన ప్రతి గింజను కొనుగోలుచేసి పంటలకు గిట్టుబాటు ధర చెల్లించాలని, రైతాంగాన్ని ఆదుకోవాలని సృజన్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆయన సీపీఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు మచ్చ రమేష్, చొప్పదండి మండల నాయకులు లంక అజయ్, రంగు రమేష్, కె.రవీందర్, మల్లేశం, కనకయ్య, రాజేశ్వరి, లచ్చయ్య తదితరులు ఉన్నారు.