![తహసీల్దార్ ఆఫీసు ఎదుట రైతుల ధర్నా](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2021/01/mdk33F.jpg?fit=677%2C286&ssl=1)
సారథి న్యూస్, చిన్నశంకరంపేట: ఒకే సర్వే నంబర్లో కొంత భూమిని అసైన్మెంట్గా చూపించడంతో శనివారం మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం జంగరాయ్ గ్రామ రైతులు స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. మాజీ డీసీఎంఎస్ డైరెక్టర్ ఆవుల గోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో సుమారు 60 మంది రైతులు తహసీల్దార్ను అడ్డుకున్నారు. సర్వేనం.270లో 490 ఎకరాల భూమిలో అగ్రవర్గానికి చెందిన ఒకే కుటుంబసభ్యులకు 10 ఎకరాలను పట్టా భూమిగా మార్చడం ఏమిటని నిలదీశారు. చివరికి అధికారులు రైతులను శాంతింపజేశారు. ఈ విషయమై తహసీల్దార్మాట్లాడుతూ.. కొంత మంది నాయకులు స్వలాభం కోసం రైతులను రెచ్చగొడుతున్నారని అన్నారు. పట్టా మార్పు విషయంలో పొరపాట్లు జరిగి ఉంటే రికార్డులు పరిశీలించి సరిదిద్దుతామని భరోసా ఇచ్చారు.