![‘ఉపాధి’ కూలీ ఇవ్వలేదని ఆత్మహత్యాయత్నం](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2021/07/kdply.jpg?fit=655%2C291&ssl=1)
సారథి, నర్సాపూర్: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేసి నాలుగు నెలలు గడిచినప్పటికీ కూలి డబ్బులు రావడం లేదని ఓ కూలీ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన శుక్రవారం మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం కంసాన్పల్లిలో చోటుచేసుకుంది. బాధితుడు, స్థానికుల కథనం మేరకు.. నాలుగు నెలల క్రితం గ్రామానికి చెందిన కూలీలు ఒర్రె లక్ష్మయ్య, దుంపల నరసింహులుతో పాటు మరికొందరు ఉపాధి పనులు చేశారు. పనిచేసి నెలలు గడుస్తున్నా డబ్బులు రాకపోవడంతో ఎంపీడీవోకు విన్నవించారు. అయినప్పటికీ ఎలాంటి పురోగతి లేకపోవడంతో ఆగ్రహించిన కూలీలు ఒక్కసారిగా గ్రామపంచాయతీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. ఇంతలో పరుగు మందు డబ్బాలు చేతిలో పట్టుకొని తాగేందుకు యత్నించారు. చేసిన పనులకు పైసలు రాకపోతే కరోనా కాలంలో ఎట్ల బతకాలని అధికారులను నిలదీశారు. ఆగ్రహించి స్థానిక సర్పంచ్, ఉపసర్పంచ్, కార్యదర్శిని పంచాయతీ ఆఫీసులోనే బంధించి తాళం వేశారు. మండల అధికారులు సర్దిచెప్పారు.