Breaking News

డ్రగ్స్ రహిత పంజాబ్‌

డ్రగ్స్ రహిత పంజాబ్‌
  • రాష్ట్రాభివృద్ధికి పది సూత్రాలు
  • అవినీతికి అంతం పలుకుతాం
  • ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌

ఛండీగఢ్: ఆమ్‌ ఆద్మీపార్టీ(ఆప్) ఐదు రాష్ట్రాల ఎన్నికలపై ఫోకస్‌ పెట్టింది. ముఖ్యంగా పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికలను అరవింద్‌ కేజ్రివాల్‌ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. మరోవైపు అధికారం తమ వద్దే ఉంచుకునేందుకు కాంగ్రెస్‌ సహా మిగిలిన పార్టీలు ముమ్మరంగా కసరత్తు చేస్తున్నాయి. అయితే ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్​కేజ్రీవాల్​పది సూత్రాలతో ‘పంజాబ్​మోడల్’​ పేరుతో రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేస్తామని ప్రజల ముందుకొచ్చారు. ఆమ్‌ ఆద్మీ పార్టీకి కార్యకర్తలే బలమని, వారే తమ పార్టీ రోల్ మోడల్స్​అని స్పష్టంచేశారు. పంజాబ్​లో రెండు రోజుల పర్యటనకు వచ్చిన ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. పంజాబ్‌లో డ్రగ్‌ సిండికేట్‌కు చరమగీతం పాడతామన్నారు. పవిత్ర గ్రంథాలను అపవిత్రం చేసే కేసుల్లో న్యాయం జరిపిస్తామని, అవినీతికి అంతం పలుకుతామని చెప్పారు. 16వేల  మెహల్లా క్లినిక్‌లు ఏర్పాటుచేసి ప్రతి ఒక్క పంజాబీకి ఉచితంగా చికిత్స అందిస్తామని, నిరంతరాయ విద్యుత్‌ను అందిస్తామని హామీ ఇచ్చారు. మహిళలకు నెలనెలా రూ.వెయ్యి పంపిణీ చేస్తామని, రైతు సమస్యల పరిష్కరానికి పాటుపడతామని చెప్పారు. హెల్త్‌ కేర్‌ విప్లవం, విద్యారంగంలో పెనుమార్పులు తీసుకురావడంతో పాటు వ్యాపారాలు చేసుకునేందుకు సానుకూలమైన వాతావరణం కల్పిస్తామని చెప్పారు. ఉద్యోగాల కోసం కెనడా వెళ్లిన యువత వెనక్కి వచ్చేలా రాష్ట్రాన్ని సుసంపన్న పంజాబ్‌గా తీర్చిదిద్దుతామని కేజ్రీవాల్ ప్రకటించారు. వారం రోజుల్లో పంజాబ్‌ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటిస్తామని వెల్లడించారు. ప్రధాని పంజాబ్‌ పర్యటనలో భద్రతా లోపం తలెత్తడంపై ఆయన స్పందిస్తూ ఆప్‌ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రధానితో పాటు సామాన్య ప్రజానీకానికి కూడా తగిన భద్రత కల్పిస్తామన్నారు. ప్రధాని భద్రతా లోపం తీవ్రమైన అంశమన్నారు. ప్రధానికి, సామాన్య ప్రజలకు భద్రత కల్పించడంలో పంజాబ్‌లోని కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలమైందని కేజ్రీవాల్​ ఆరోపించారు.