Breaking News

డ్రోన్‌ విధ్వంసక టెక్నాలజీ

డ్రోన్‌ విధ్వంసక టెక్నాలజీ
  • త్వరలోనే అందుబాటులోకి రానుంది
  • బీఎస్‌ఎఫ్‌ 57వ రైజింగ్‌ డేలో
  • కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా

జైసల్మేర్‌: దేశభద్రతకు డ్రోన్ల ముప్పు పెరుగుతున్న నేపథ్యంలో వాటి విధ్వంసక టెక్నాలజీని బీఎస్‌ఎఫ్‌, డీఆర్‌డీవో, ఎన్‌ఎస్‌జీ సంస్థలతో కలిసి సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్నామని కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌ షా వెల్లడించారు. త్వరలోనే ఇది భద్రతా బలగాలకు అందుబాటులోకి రానుందని తెలిపారు. ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వానికి సరిహద్దు భద్రతే.. దేశ భద్రత అని చెప్పారు. సరిహద్దుల రక్షణకు కావాల్సిన అత్యాధునిక సాంకేతికతను సమకూర్చేందుకు కేంద్రం కట్టుబడి ఉందని తెలిపారు. ఆదివారం బార్డర్​సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్‌ఎఫ్‌) 57వ రైజింగ్‌ డే సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రధాని మోడీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచే సరిహద్దు భద్రతకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నారని తెలిపారు. 50వేల మంది జవాన్లను కొత్తగా నియమించామని, వారికి ప్రస్తుతం శిక్షణ కొనసాగుతోందన్నారు. 2008-14 మధ్య రూ.23వేల కోట్లుగా ఉన్న సరిహద్దు రోడ్ల నిర్మాణ బడ్జెట్‌ను రూ.44,600 కోట్లకు పెంచినట్లు తెలిపారు. సరిహద్దుల్లో చొరబాట్లు, భద్రతా దళాలపై దాడులు.. ఇలా ఎలాంటి ముప్పు తలెత్తినా వెంటనే తిప్పికొట్టేలా చర్యలు తీసుకున్నామన్నారు. ఈ క్రమంలోనే మెరుపు దాడులు, వైమానిక దాడులు నిర్వహించామని తెలిపారు. దీన్ని యావత్తు ప్రపంచం ప్రశంసించిందని గుర్తుచేశారు. అనంతరం 1971లో భారత్-పాకిస్తాన్ యుద్ధంలో కీలక పాత్ర పోషించిన భైరవ్ సింగ్ రాథోడ్‌ తో అమిత్ షా భేటీ అయ్యారు.