Breaking News

ఢిల్లీలో ధర్నా చేయొచ్చు కదా?

  • December 28, 2021
  • Archive
  • Comments Off on ఢిల్లీలో ధర్నా చేయొచ్చు కదా?
ఢిల్లీలో ధర్నా చేయొచ్చు కదా?
  • జోనల్‌ వ్యవస్థ పూర్తికాగానే నోటిఫికేషన్లు
  • మంత్రి నిరంజన్‌రెడ్డి

సామాజికసారథి, హైదరాబాద్‌: తెలంగాణలో కొత్త జోనల్‌ వ్యవస్థ ప్రకారం ఉద్యోగుల విభజన ప్రక్రియ కొనసాగుతోందని, అది ముగియగానే కొత్త నోటిఫికేషన్లు విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోందని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి తెలిపారు. సోమవారం తెలంగాణ భవన్‌లో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు 1,32,899 ప్రభుత్వ ఉద్యోగాలను టీఆర్‌ఎస్‌ సర్కార్‌ ఇచ్చిందన్నారు. మిగతా ఖాళీలకు సంబంధించి ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇచ్చేందుకు కసరత్తు చేస్తోందని తెలిపారు. కేంద్రం పరిధిలో 8,72,243 ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నారు. సమస్యలను అర్థం చేసుకోకుండా నోటిఫికేషన్లు త్వరగా విడుదల చేయాలని ఇక్కడ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ దీక్ష చేస్తున్నారని, ఈ ఏడుపేదో ఆయన ఢిల్లీలో ఏడవాలని ఎద్దేవా చేశారు. బండి సంజయ్‌ కు దమ్ముంటే ఉద్యోగ ఖాళీలపై కేంద్రాన్ని నిలదీసి నోటిఫికేషన్లు ఇప్పించాలని సవాల్‌ విసిరారు. మీ గొప్పతనంతో కేంద్రం నుంచి 50 నుంచి లక్ష ఉద్యోగాలు ఇప్పిస్తే బాగుంటుందన్నారు. ఈ కొలువుల భర్తీ కోసం ఒక్కనాడైనా రాష్ట్ర బీజేపీ, కాంగ్రెస్‌ నేతలు కేంద్రాన్ని నిలదీశారా? అని ప్రశ్నించారు. ఉద్యోగాల కోసం కాంగ్రెస్‌ ఏనాడైనా ఆందోళన చేపట్టిందా?.. పేరుకే కాంగ్రెస్‌ జాతీయ పార్టీ కానీ.. బీజేపీని ఎక్కడ నిలదీయదని నిరంజన్‌రెడ్డి ఎద్దేవా చేశారు.