Breaking News

రాష్ట్రంలో 1,673 కొవిడ్ కేసులు

రాష్ట్రంలో 1,673 కొవిడ్ కేసులు
  • మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో అధికం
  • నేటి నుంచి బూస్టర్​డోస్​వ్యాక్సినేషన్​

సామాజికసారథి, హైదరాబాద్: రాష్ట్రంలో ఆదివారం కొత్తగా 1,673 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో 330 మంది కరోనా నుంచి కోలుకున్నారని ప్రజారోగ్యశాఖ తాజా బులెటిన్ లో తెలిపింది. రాష్ట్రంలో కొవిడ్ రికవరీ రేటు 97.46 శాతంగా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 13,522 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో ఇంతవరకు 6,94,030 కొవిడ్ కేసులు నమోదుకాగా, వారిలో 6,76.466 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో కొవిడ్ తదితర కారణాలతో ఒకరు మరణించారు. దీంతో ఇంతవరకు మరణించిన వారి సంఖ్య 4,042కు చేరింది. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 1,165 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో 149, రంగారెడ్డి జిల్లాలో 123, సంగారెడ్డిలో 44, హన్మకొండలో 34 కరోనా కేసులు నమోదయ్యాయి. మరోవైపు సోమవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా బూస్టర్‌ డోస్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభిస్తున్నారు. హెల్త్‌ కేర్ వర్కర్లు‌, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లతో పాటు 60 ఏళ్లు పైబడి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి బూస్టర్‌ డోస్‌ ఇవ్వనున్నారు. రెండో డోస్‌ తీసుకుని 9 నెలలు పూర్తయిన వారు మాత్రమే టీకా తీసుకునేందుకు అర్హులుగా వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. బూస్టర్‌ డోస్‌ వేయించుకోడానికి ఎలాంటి ముందస్తు రిజిస్ట్రేషన్‌ అక్కర్లేదని, గతంలో టీకా కోసం చేసుకున్న రిజిస్ట్రేషన్ ఆధారంగా బూస్టర్‌ డోస్‌ కోసం స్లాట్‌ బుక్‌ చేసుకోవచ్చని, నేరుగా వ్యాక్సినేషన్‌ కేంద్రానికి వెళ్లి టీకాలు వేసుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా 8.3లక్షల మంది 60 ఏళ్లు పైబడి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు ఉన్నట్లు ప్రభుత్వం అంచనా వేసింది.