![12 ఏండ్లయినా పరిహారం ఇవ్వరా?](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/07/cpi-22f.jpg?fit=450%2C461&ssl=1)
సారథి న్యూస్, హుస్నాబాద్: గౌరవెల్లి భూ నిర్వాసితులకు 12 ఏండ్లయిన పరిహారం ఇవ్వలేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి అన్నారు. ఈ మేరకు శనివారం నీటిపారుదల శాఖ సెక్రటరీ, సీఎం కేసీఆర్కు లేఖలు రాశారు. గౌరవెల్లి ప్రాజెక్టు రీ డిజైన్లో భాగంగా 1.4 నుంచి నుంచి 8.2 టీఎంసీల సమర్థ్యాన్ని పెంచడంతో ప్రాజెక్టు కింద రెండవసారి నిర్వాసితులు భూములను కోల్పోయారన్నారు. భూ నిర్వాసితులు ఏండ్ల తరబడి నష్టపరిహారం కోసం మంత్రులు, కలెక్టర్, ఎమ్మెల్యే, ఆర్డీవో ఆఫీసుల చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారన్నారు. పాలకులు మారినట్లే అనేక మంది రెవెన్యూ ఆఫీసర్లు మారడంతో నిర్వాసితులు వారి సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే చందంగా మారిందన్నారు. పూర్తిస్థాయిలో పరిహారం ఇచ్చే వరకు పోలీసు పహారాలో పనులు నిర్వహించకుండా 15 రోజుల పాటు ప్రాజెక్టు పనులు నిలిపివేయాలన్నారు. మెట్ట ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు సీపీఐ ఆధ్వర్యంలో అనేక ఉద్యమాలు నిర్వహించామని, తాను ఎమ్మెల్యేగా ఉన్న క్రమంలోనే నాటి దివంగత ముఖ్యమంత్రి వైస్ రాజశేఖరరెడ్డి శిలాఫలకం వేశారని గుర్తుచేశారు.