![హోటల్ను కూల్చిన సర్పంచ్భర్తను అరెస్ట్చేయాలి](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2021/01/jbi-1.jpg?fit=677%2C341&ssl=1)
సారథి న్యూస్, వంగూరు: నాగర్కర్నూల్ జిల్లా వంగూరు మండలం డిండిచింతపల్లిలో నిరుద్యోగ పట్టభద్రుడు, గురుకుల విద్యాలయం పూర్వవిద్యార్థి రామచంద్రం నిర్వహిస్తున్న హోటల్ను కూల్చివేసిన అదే గ్రామ సర్పంచ్ భర్త, టీఆర్ఎస్ నాయకుడు బత్తిని రవీందర్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలని ఆల్ ఇండియా కాన్ఫడరేషన్ ఆఫ్ ఎస్సీ, ఎస్టీ ఆర్గనైజేషన్స్(ఏఐసీఎస్ వో) రాష్ట్ర అధ్యక్షుడు మహేశ్వర్రాజ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం ఆయన జైభీమ్ యూత్ ఇండియా వ్యవస్థాపక అధ్యక్షుడు ముకురాల శ్రీహరితో కలిసి బాధితుడు రామచంద్రంను కలిసి మాట్లాడారు. ప్రభుత్వం పట్టా ఇచ్చిన తన సొంత భూమిలో హోటల్ కట్టుకుని జీవనం సాగిస్తున్న క్రమంలో బత్తిని రవీందర్ రెడ్డి కుల దురహంకారంతో కూల్చడం చాలా దారుణమన్నారు. కలెక్టర్ వెంటనే స్పందించి బాధితుడికి న్యాయం చేయాలని, అదేవిధంగా ఈ ఘాతుకానికి పాల్పడిన నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. తన అధికారాలను దుర్వినియోగం చేసిన సర్పంచ్ ను పదవి నుంచి తొలగించాలని కోరారు. జైభీమ్ యూత్ ఇండియా ఆధ్వర్యంలో ఈనెల 11న చేపట్టే చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2021/01/jbi22.jpg?resize=640%2C270&ssl=1)