Breaking News

స్పిన్ చేయకపోయినా.. వికెట్లు తీశాడుగా

న్యూఢిల్లీ: బంతిని ఎక్కుగా స్పిన్ చేయలేడని విమర్శలు వచ్చినా.. అనిల్ కుంబ్లే అందరికంటే ఎక్కువ వికెట్లే తీశాడని మాజీ స్పిన్నర్ హర్భజన్ అన్నాడు. వాస్తవంగా చెప్పాలంటే కుంబ్లే మీద వచ్చిన విమర్శలు కరెక్ట్ కావన్నాడు. భారత్ తరఫున అత్యుత్తమ మ్యాచ్ విన్నర్ కుంబ్లే అని భజ్జీ స్పష్టం చేశాడు. ‘బంతిని టర్న్ చేశాడా? లేదా? కాదు.. వికెట్లు పడ్డాయా? లేదా? అన్నది ముఖ్యం. ఈ విషయంలో కుంబ్లే బాయ్ చాలా ముందున్నాడు. చాలా ఏళ్లు అతనితో కలిసి క్రికెట్ ఆడినందుకు సంతోషిస్తున్నా. కుంబ్లే నిజమైన చాంపియన్. అంకితభావం కలిగిన ఆటగాడు. భారత్ నుంచి ఇప్పటివరకు ఇలాంటి క్రికెటర్ ను చూడలేదు’ అని హర్భజన్ వ్యాఖ్యానించాడు. ఒకవేళ కుంబ్లే.. బంతిని స్పిన్ చేయకపోతే ఆల్​టైమ్​ జాబితాలో మూడో స్థానం ఎలా దక్కుతుందని ప్రశ్నించాడు. ప్రపంచ మేటి జట్లపై కుంబ్లే రికార్డులను చూస్తే అతను ఎంత గొప్ప బౌలరో అర్థమవుతుందన్నాడు. ఆల్టైమ్ బౌలింగ్ జాబితాలో 619 వికెట్లతో వార్న్, మురళీధరన్ తర్వాతి స్థానాన్ని కుంబ్లే సొంతం చేసుకున్నాడన్నాడు. ఇక టెస్ట్ ఇన్నింగ్స్​లో పదికి పది వికెట్లు తీసి జిమ్ లేకర్ సరసన చోటు కూడా సంపాదించాడన్నాడు.