Breaking News

సెప్టెంబర్ 26 నుంచి ఐపీఎల్

ముంబై: పరిస్థితులు ఎలా ఉన్నా ఈ ఏడాది ఐపీఎల్​ను నిర్వహించాలనే పట్టుదలతోనే బీసీసీఐ ముందుకెళ్తున్నట్లు తెలుస్తోంది. టీ20 ప్రపంచకప్​పై క్రికెట్ ఆస్ట్రేలియా వ్యాఖ్యలు అలా వచ్చాయే లేదో.. ఐపీఎల్ కోసం తాత్కాలిక షెడ్యూల్​కు అనుకున్నట్లు సమాచారం. సెప్టెంబర్ 26 నుంచి నవంబర్ 8 వరకు లీగ్​ను నిర్వహించాలని ఆలోచనలు చేస్తున్నట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. అయితే టీ20 ప్రపంచకప్ అధికారిక నిర్ణయం వెలువడిన తర్వాత, ఇతర అంతర్జాతీయ టోర్నీలను చూసుకుని ఈ తేదీల్లో కాస్త మార్పులు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి.

ఓవరాల్​గా 43 రోజులను లీగ్ కోసం కేటాయించినట్లు తెలుస్తుండడంతో ఈసారి మ్యాచ్​ల సంఖ్య తగ్గనుంది. విదేశాల్లో లీగ్​ను నిర్వహించే ప్రతిపాదనలు వస్తున్నా భారత్​లోనే ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. వర్షం తక్కువగా ఉండే నగరాలను ఎంచుకుని, ఖాళీ స్టేడియాల్లో మ్యాచ్​లు నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. మరోవైపు స్వదేశమా, విదేశామా? అనుకోకుండా ఎక్కడో ఓ దగ్గర లీగ్ నిర్వహించాలని ఫ్రాంచైజీ యజమానులు కోరుకుంటున్నారు. లీగ్ నిర్వహణ తలకు మించిన భారమే అయినా.. బీసీసీఐ అన్ని చర్యలు తీసుకుంటుందని చెబుతున్నారు. టీవీల్లో మ్యాచ్​లు వస్తే చాలు.. తమతో పాటు స్పాన్సర్లు అందరూ సంతోషిస్తారని కింగ్స్ ఎలెవన్ సహా యజమాని నెస్ వాడియా అన్నాడు.